- రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
- డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో మొదటిసారిగా వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) తగ్గించాలని కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. రెపో రేటు తగ్గనుండడంతో దీనికి లింకై ఉన్న హోమ్, ఆటో, ఇతర లోన్లపై వడ్డీ దిగిరానుంది. తాజా రేట్ల కోతతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది. మే 2020 తర్వాత మొదటిసారిగా రేట్లకు కోత పెట్టగా, గత రెండున్నరేళ్లలో మొదటిసారిగా వడ్డీ రేట్లను సవరించారు.
కాగా, వడ్డీ రేట్లను తగ్గించాలని గత ఎంపీసీ మీటింగ్లో కేంద్రం ఆర్బీఐని కోరినప్పటికీ, అప్పటి గవర్నర్ శక్తి కాంత దాస్ రేట్లను యదాతథంగా కొనసాగించడానికి మొగ్గు చూపారు. దాస్ ప్లేస్లో గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా తన మొదటి ఎంపీసీ మీటింగ్లో రేట్లను తగ్గించడంపై ఫోకస్ పెట్టారు. ఫండ్స్ కొరత ఉన్నప్పుడు ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే లోన్లపై వేసే వడ్డీని రెపో రేటు అంటారు. బ్యాంకులు తమపై పెరిగిన వడ్డీ భారాన్ని కస్టమర్లకు బదలాయిస్తాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే హోమ్, కారు, పర్సనల్ లోన్లపై వడ్డీ దిగొస్తుంది. మరోవైపు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్పై తక్కువ వడ్డీ వస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతమే
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.7 శాతం వృద్ది చెందుతుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఇదే టైమ్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.2 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 6.4 శాతంగా, రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.8 శాతంగా రికార్డవుతాయని అంచనా వేసింది. ఇండియా జీడీపీ 7 శాతానికి పైగా వృద్ధి చెందగలదని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు. బడ్జెట్లోని ట్యాక్స్ రిలీఫ్స్పై ఆయన మాట్లాడారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం వలన ఇన్ఫ్లేషన్ పెరగదని, ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని వివరించారు. వృద్ధి, ఇన్ఫ్లేషన్..రెండు యాంగిల్లోనూ బడ్జెట్ బాగుందని అన్నారు. ‘బడ్జెట్లో అగ్రికల్చర్పై ఫోకస్ పెట్టడంతో పప్పులు, నూనె గింజలు, ఇతర పంటల దిగుబడి పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫ్లేషన్ దిగొస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లోని పంటల దిగుబడితో ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని, రబీ పంటల దిగుబడి కూడా పెరుగుతుందని మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.
రూపాయి లెవెల్ ఎంత ఉన్నా పర్వాలేదు. కానీ..
రూపాయి విలువ ఎంత ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలనే దానిపై ఆర్బీఐ ఫోకస్ పెట్టడం లేదని, నిలకడగా ఉండాలని చూస్తోందని మల్హోత్రా అన్నారు. ‘రూపాయి విలువలో రోజువారి కదలికలను పట్టించుకోవద్దు. లాంగ్ టెర్మ్ ఎక్స్చేంజ్ రేటుపై ఫోకస్ పెట్టాలి’ అని ఆయన పేర్కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ తాజాగా 87.59 కి క్షీణించింది. కిందటేడాది నవంబర్ 6 నుంచి ఇప్పటి వరకు 3.2 శాతం తగ్గింది. మరోవైపు గవర్నమెంట్ సెక్యూరిటీలను సెకెండరీ మార్కెట్లో కొనడానికి, అమ్మడానికి ఎన్డీఎస్–ఓఎం ప్లాట్ఫామ్ను వాడుకునేందుకు నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు కూడా ఆర్బీఐ వీలు కల్పించింది. సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇటువంటి కంపెనీలు తమ క్లయింట్ల తరపున నెగోషియేటింగ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం)ను వాడొచ్చు.