బడా బాబులు సంపాదిస్తుంటే.. వాళ్ల పిల్లలు హంగామా: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు ఆసక్తికర వాఖ్యలు

బడా బాబులు సంపాదిస్తుంటే.. వాళ్ల పిల్లలు హంగామా: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు ఆసక్తికర వాఖ్యలు

హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‎పై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టింది. 2024, అక్టోబర్ 28న ఈ పిటిషన్‎ను విచారించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.. విచారణ సందర్భంగా హైదరాబాద్‎లో రోడ్డు ప్రమాదాలపై కీలక వాఖ్యలు చేశారు. 

‘‘హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్‎, బంజారాహిల్స్‎లో దాదాపు 55 నుండి 60 పబ్బులు ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రతి రోజూ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. పబ్‎ల బయట డ్రైవ్‎లు పెట్టీ ప్రమాదాలను నివారించాలి. బడా బాబులు సంపాదిస్తుంటే, వారి పిల్లలు పబ్‎లలో హంగామా చేస్తూ ర్యాష్ డ్రైవింగ్‏కు పాల్పడుతున్నారు’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పబ్‎లకు సైతం కొన్ని నిబంధనలు విధించాలని ఈ మేరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్‎కు ఆయన సూచించారు. 

మరోవైపు, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని.. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల కోర్టును ఆశ్రయించాడు. రాజ్ పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‎ను విచారించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల సమయం ఇచ్చింది. రెండు రోజుల తర్వాత పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.