
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ కు అవసరమైన స్థలాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ నిషాన్ ఘాట్ ను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ నిషాన్ ఘాట్ లో స్థలాన్ని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిషాన్ ఘాట్ లో 38వ సర్వే నెంబర్లో 20 ఎకరాల భూమిని సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించేలా అప్పగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.