
- సెపరేట్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రాఘవరెడ్డి
- ఆయనకు సహకరించే వాళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్న నాయిని
- వెస్ట్లో ఎవరికి వారే అన్నట్లుగా కార్యక్రమాల నిర్వహణ
- తూర్పులోనూ కొండా, స్వర్ణ వర్గాల మధ్య విభేదాలు
హనుమకొండ, వెలుగు: ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఓరుగల్లు కాంగ్రెస్లో ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. వరంగల్ తూర్పు, పశ్చిమ లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకోగా, టికెట్ ఆశావహుల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వరంగల్ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైకమాండ్ పిలుపు మేరకు చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాన్ని వీరిద్దరూ వేర్వేరుగా నిర్వహించడంతో ఇద్దరి మధ్య విభేదాలను మరోసారి బయటపడ్డాయి. వరంగల్ వెస్ట్ పరిస్థితి ఇలా ఉంటే.. తూర్పులో అసలు నిరసన కార్యక్రమమే చేపట్టకపోవడం గమనార్హం. కొండా దంపతులకు, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు మధ్య ఆధిపత్య పోరు వల్లే కార్యక్రమాన్ని చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వెస్ట్లో నాయిని వర్సెస్ జంగా
గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా వరంగల్ వెస్ట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ లీడర్లకు అవకాశం దక్కకుండా పోయింది. ఈ సారి ఎలాగైనా వరంగల్ వెస్ట్ టికెట్ దక్కించుకోవాలని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే నాయిని టికెట్ ఆశించి భంగపడగా, జంగా రాఘవరెడ్డి మాత్రం అప్పుడు పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వరంగల్ వెస్ట్పై ఫోకస్ పెట్టారు. డీసీసీ భవన్ కేంద్రంగా నాయిని కార్యక్రమాలు చేపడుతుండగా, జంగా రాఘవరెడ్డి మాత్రం హనుమకొండ హంటర్ రోడ్డులో ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే తన అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఎవరికి వారుగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు.
జంగాతో పాటు ఆయన వర్గీయుల సస్పెన్షన్
ఇరువురి మధ్య విబేధాలు పెరిగిపోవడంతో జంగాకు చెక్ పెట్టేందుకు నాయిని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జంగా రాఘవరెడ్డి పని చేస్తున్నారంటూ గత మార్చిలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్రెడ్డి ప్రకటించారు. దీంతో తన సభ్యత్వం రద్దు చేసే అధికారం నాయినికి లేదంటూ జంగా కూడా ఘాటుగానే స్పందించారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో విషయం కాస్త హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో ఇద్దరికీ నచ్చజెప్పినట్లు సమాచారం. అయినా విబేధాలు తగ్గకపోగా ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగిపోయింది.
డీసీసీ ప్రెసిడెంట్ అయిన తనను కాకుండా రాఘవరెడ్డిని ఆహ్వానిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని, కాంగ్రెస్లో ఉంటూ బీఆర్ఎస్కు కోవర్ట్గా పని చేస్తున్నారంటూ రంగంపేటకు చెందిన సీనియర్ నాయకుడు వై.భాస్కర్ను ఇటీవల నాయిని సస్పెండ్ చేశారు. రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే వినయ్భాస్కర్కు సపోర్ట్ చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సస్పెన్షన్ లెటర్లో పేర్కొన్నారు. అలాగే జంగాకు సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలు, నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు నాయిని రాజేందర్రెడ్డి లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే మరికొందరిపైనా యాక్షన్ తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
తూర్పులోనూ రగులుతున్న పోరు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా కొండా దంపతులు, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందటి వరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు నాయిని రాజేందర్రెడ్డే అధ్యక్షుడిగా కొనసాగారు. ఇటీవల వరంగల్ జిల్లా అధ్యక్ష పదవిని హైకమాండ్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణకు ఇచ్చింది. దీంతో తాము రెఫర్ చేసిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం పట్ల మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అసంతృప్తితో ఉన్నారు. వరంగల్ తూర్పు తమదేనంటూ కొండా దంపతులు ప్రచారం చేసుకుంటుండగా, ఇప్పుడు స్వర్ణ ఎంట్రీతో ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి.
అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కొండా దంపతులు దూరంగా ఉండటం, మూడు రోజుల కిందట నిర్వహించిన ఓ మీటింగ్ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ ఇంతవరకూ తమకు ఫోనే చేయలేదని మురళి ప్రకటించడం ఇద్దరి మధ్య పోరుకు అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే గురువారం అన్ని చోట్ల నిరసనల కార్యక్రమాలు కొనసాగినా తూర్పులో ఇటు ఎర్రబెల్లి స్వర్ణ వర్గంగానీ, అటు కొండా వర్గంగానీ ఎవరూ కార్యక్రమాలు చేపట్టలేదు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత పార్టీలో ఊపు వస్తుందనుకుంటే లీడర్ల మధ్య వర్గ పోరుతో డీలా పడాల్సి వస్తోందని కార్యకర్తలు వాపోతున్నారు.