కవ్వాల్​ టైగర్ ​జోన్​లో పులి రాకకు ఎదురుచూపులు

కవ్వాల్​ టైగర్ ​జోన్​లో  పులి రాకకు ఎదురుచూపులు
  • అయినప్పటికీ కనిపించని పెద్ద పులి జాడ
  • నేడు అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం

జన్నారం,వెలుగు: కవ్వాల్ ​టైగర్​ జోన్​లో​ పులుల జాడ కనిపించడంలేదు. వాటి రాకపోకలు సాగించేందుకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఈ వైపు రావడంలేదు. జులై 29న పులుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హడావిడిగా కార్యక్రమాలు నిర్వహించే ఫారెస్ట్ ఆఫీసర్లు.. వాటిని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. నాలుగేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 26 పెద్ద పులులున్నాయని ప్రకటించింది. అందులో కవ్వాల్​టైగర్​జోన్​ఫరిధిలో 6 నుంచి 8 వరకు ఉన్నట్లు అంచనా వేసింది. కానీ కొంత కాలంగా వాటి జాడ కనిపించడమే లేదు.

కలప స్మగ్లింగ్​తో..

కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్​10న కవ్వాల్​రిజర్వ్ ఫారెస్ట్​ను టైగర్ ​జోన్​గా ఏర్పాటు చేస్తూ జీవో  నెం.27 విడుదల చేసింది. అప్పటికి కవ్వాల్ పరిధిలో పెద్దపులులు లేవు. అంతకుముందు మహారాష్ట్ర తాడోబాలోని  టైగర్ ​రిజర్వ్ నుంచి కవ్వాల్ అటవీ ప్రాంతంలోకి రాకపోకలు సాగించేవి. కాలక్రమేణా అడవిలో కలప స్మగ్లింగ్ పెరిగిపోవడం, అలికిడి ఎక్కువ కావడంతో పులులు ఈ వైపునకు రావడం మానేశాయి. టైగర్ జోన్ ఏర్పడిన మూడేండ్లకు 2015లో దొంగపెల్లి, కవ్వాల బీట్​లో పులి సంచరించినట్టు అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. 2016లో కడెం అడవిలో ఓ ఆవుపై దాడి చేయడంతో పులి సంచరిస్తున్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ కొద్ది రోజులకే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ అటవీ ప్రాంతం వైపు వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తున్నాయి.

తాడోబాలో 97  పెద్ద పులులు

కవ్వాల్ టైగర్ జోన్​కు సమీపంలోని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తాడోబా టైగర్ జోన్​లో 97 పులులున్నట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టీసీఏ) అంచనా వేసింది. 625.82 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న తాడోబా టైగర్ జోన్​లో 97 పులులుంటే.. 892.23 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న కవ్వాల్ టైగర్ జోన్​లో ఒక్క పులి కూడా లేకపోవడం ప్రశ్నార్థకంగా మిగిలింది. 

చేయని ప్రయత్నం లేదు..

కవ్వాల్​ టైగర్ ​జోన్​లో పులి ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఫారెస్ట్​ ఆఫీసర్లు దాని ఆహారం కోసం శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అడవిలో లభించే ఆహారమే కాకుండా అదనంగా900 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలను (గ్ర్యాస్​ ల్యాండ్)ను జన్నారం అటవీ డివిజన్​లోని తాళ్లపేట రేంజ్​మహ్మదాబీట్, ఇందన్​పెల్లి రేంజ్​లో పెంచుతున్నారు. దీంతో జోన్​ పరిధిలో శాకాహార జంతువుల సంఖ్య పెరిగింది. పెరిగిన గడ్డి క్షేత్రాల్లో మేసేందుకు వచ్చే వన్యప్రాణులను వేటాడేందుకు పులికి అనువుగా ఉంటుందని అధికారులు భావించినప్పటికీ కవ్వాల్ వైపు పులులు 
అడుగుపెట్టడంలేదు.  పులులను ఆకర్శించేలా అధికారులు మరిన్ని ప్రయత్నాలు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.