ఇంటింటికీ ఇంటర్నెట్! గ్రామాల్లో మూడు నెలల పాటు టెస్టింగ్

ఇంటింటికీ ఇంటర్నెట్! గ్రామాల్లో మూడు నెలల పాటు టెస్టింగ్

సిటీ జనం మొదలుకొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల వరకూ ప్రతి ఇంటికీ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా గ్రామాల్లో మూడు నెలల పాటు ఇంటర్నెట్ సర్వీస్ టెస్టింగ్​కు రెడీ అయింది. ఆ మూడు నెలలు పైలెట్ ప్రాజెక్టు కింద ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసులతో పాటు కేబుల్ టీవీ ప్రసారాలను అందించనుంది. ఆ తర్వాత అతి తక్కువ ధరకే ఆ సర్వీసులను ప్రొవైడ్​ చేయనుంది. టీఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అందించనున్న ఈ సేవలను ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రజలకు చేర్చాలని సర్కారు భావిస్తున్నది. అందుకు అనుగుణంగా టెస్టింగ్ కోసం ఇప్పటికే టీఫైబర్​ తరఫున తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) కొద్ది రోజుల క్రితం షార్ట్​టర్మ్ టెండర్లను ఆహ్వానించింది.

బిడ్ దాఖలు చేసిన కంపెనీలు ఈ నెల13న ప్రజెంటేషన్​ఇవ్వనున్నాయి. ఎంపికైన సంస్థలతో మూడు నెలలపాటు టీఫైబర్​ ఒప్పందం చేసుకుని హైస్పీడ్ ఇంటర్నెట్​తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలను అందించనుంది.ఆ తర్వాత కూడా సంస్థలు తమ ఒప్పందాన్ని పొడిగించుకునే అవకాశం కల్పించింది. మొత్తం మీద 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి ఇంటర్నెట్​ను ప్రజల గుమ్మం వరకు తీసుకెళ్తారు. ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత అతి తక్కువ ధరకే ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ సర్వీసులను సర్కారు అందించనుంది. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా ఈ స్కీంను సర్కారు తీసుకొస్తున్నది. 


మూడు నెలలపాటు ఫ్రీ.. 


ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇన్​స్టాలేషన్​ను సర్కారు ఫ్రీగా చేపట్టనుంది. టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థకు ఇంటర్నెట్ ఇన్​స్టాలేషన్, మారుమూల ప్రాంతాల వరకు ఓఎఫ్​సీ కేబుల్స్ వేసి ప్రజలకు ఇంటర్నెట్ అందించే బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం సీపీఈ చార్జీలను టీఫైబర్ ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. తొలి మూడు నెలల పాటు సర్వీసులను ప్రజలకు ఫ్రీగా అందించనున్న సర్కారు.. ఆ చార్జీలను టెండర్లలో సెలెక్ట్​ అయిన సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లిస్తుంది. ఆ తర్వాత అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్​తో పాటు కేబుల్ టీవీ సర్వీస్​లను అందిస్తుంది. గ్రామాల్లో నెట్​వర్క్​కోసం ప్రత్యేకంగా గ్రిడ్​ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన సంస్థలు టీఫైబర్ నెట్​వర్క్ ఓఎఫ్​సీ కేబుల్స్​ ద్వారా గ్రామాల్లోని ఇండ్లకు కనెక్టివిటీని అందించాల్సి ఉంటుంది. లేదంటే గ్రామాల్లో ఇప్పటికే ఉన్న కేబుల్ ఆపరేటర్ల ద్వారా కూడా ఎంపికైన సంస్థలు ఒప్పందం చేసుకునేందుకు  సర్కారు వెసులుబాటు కల్పించింది. 

అయితే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్(ఎస్ఎల్ఏ)లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సర్వీస్​లో ఫెయిల్ అయ్యే సంస్థలకు సర్కారు పెనాల్టీలు వేయనుంది. కేటగిరీని బట్టి 5 నుంచి 20 శాతం వరకు పెనాల్టీ విధించనుంది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీసులను అందించాలన్న ఉద్దేశంతోనే సర్కారు ఈ నిబంధన పెట్టింది. 

ప్రభుత్వ సంస్థలకు కూడా

ఎంపికైన సంస్థల ప్యాకేజీలో భాగంగా బేసిక్ టీవీ ఛానల్స్‌తో పాటు డబ్బులను చెల్లించే చానెళ్లనూ హెచ్‌డీ క్వాలిటీలో అందించాల్సి ఉంటుంది. కనీసం 20 ఎంబీపీఎస్ స్పీడ్ కు తగ్గకుండా ఇంటర్నెట్ అందించాలి. 500 జీబీ వరకు అదే స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలి. పరిమితి దాటితే 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందించాలి. అలాగే జీ2సీ (ప్రభుత్వం నుంచి పౌరులకు అందించే సేవలు) టీశాట్, రిమోట్ ఎడ్యుకేషన్ వంటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేవలకూ ఇంటర్నెట్ సౌలతులను సంస్థలు మెరుగుపరచాల్సి ఉంటుంది. జీ2సీ సర్వీస్ ఒప్పందంలో భాగంగా గ్రామాల నుంచి పట్టణ స్థాయి.. వరకు ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్.. అందించాల్సి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ కోసం ఒక్కో గ్రామంలో కెమెరాతో కూడిన 23 డిస్ప్లేలకు (గరిష్ఠంగా 5 డిస్ప్లేలకు ఇంటర్నెట్ ఇవ్వాలి. దానితో పాటు 27 డిస్ప్లేతో పాటు కీబోర్డు, మౌస్, టీవీ యాప్స్ అందజేయాలి. రిమోట్ యూజర్ శాంపిల్ కోసం ప్రతి గ్రామంలో ఐదు ట్యాబ్స్‌ను -ఇచ్చి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి