చిరుత చర్మంతో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర స్మగ్లర్లు

చిరుత చర్మంతో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర స్మగ్లర్లు

చెన్నూర్, వెలుగు: చిరుతపులి చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను చెన్నూర్ ఫారెస్టు ఆఫీస్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నంలోని బారెగూడ ప్రాంతం నుంచి కొంతమంది మంచిర్యాలకు చిరుత చర్మం విక్రయించడానికి వస్తున్నారని సమాచారం రావడంతో కోటపల్లి ఎస్ఐ సిబ్బందితో రాపన్ పల్లి, సిరోంచ బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. 

ఆ టైంలో బైక్​పై చిరుత చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రెండేండ్ల క్రితం బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో చిరుత పులిని చంపామని, ఆ చర్మాన్నే అమ్మేందుకు తీసుకువస్తున్నామని ఒప్పుకున్నారు. పులి చర్మంతో పాటు రెండు బైక్​లు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దుర్గం పవన్, బాబర్ ఖాన్​పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎఫ్ఏవో రమేశ్ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు. కోటపల్లి సీఐ సుధాకర్, ఎస్ఐ రవీందర్, కోటపెల్లి ఎఫ్ఆర్ వో రవి పాల్గొన్నారు.