సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్​లు కేటాయించాలె : జనక్​ ప్రసాద్

సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్​లు కేటాయించాలె : జనక్​ ప్రసాద్

కోల్​బెల్ట్, వెలుగు: కొత్త బొగ్గు బ్లాక్​లు కేటాయించి సింగరేణి సంస్థను కాపాడేందుకు చొరవ చూపాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్​లాల్​మీనాను ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​ బి.జనక్​ ప్రసాద్ కోరారు. శుక్రవారం హైదరాబాద్​ సింగరేణి భవన్​లో అధికారిక సమావేశానికి హాజరైన కోల్​ సెక్రటరీని ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి మనుగడ కొత్త బొగ్గు గనులపై ఆధారపడి ఉందని, బొగ్గు బ్లాక్​లు కేటాయిస్తే 40 వేల కార్మిక కుటుంబాలను రక్షించడంతోపాటు రాష్ట్ర, దేశ అవసరాలకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసే ఛాన్స్​ ఉంటుందన్నారు.

2030 నాటికి సింగరేణిలోని పాత గనులు మూతపడి క్లిష్టపరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు.  భవిష్యత్తులో సింగరేణి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో ప్రజలు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కోల్​సెక్రటరీ సింగరేణి సంస్థను తప్పక రక్షిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. కోల్​ సెక్రటరీ వెంట సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్​ ఉన్నారు.