
హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, సంస్థలపై ఐటీశాఖ దాడుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఐటీశాఖ అధికారి రత్నాకర్.. మంత్రి మల్లారెడ్డిపై చోరీ కేసు పెట్టారు. ప్రస్తుతం బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ల్యాప్ టాప్ అయితే ఉంది. ఆ ల్యాప్ టాప్ ను తీసుకెళ్లాలని పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ ను కోరారు. కానీ, 36 గంటలు గడుస్తున్నా దాన్ని తీసుకెళ్లలేదు. బోయిన్ పల్లి పీఎస్ లో ఉన్న ల్యాప్ టాప్ తనది కాదని ఐటీ అధికారి రత్నాకర్ చెబుతున్నారు. తన ల్యాప్ టాప్ ను తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాల సందర్భంగా ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ల్యాప్ టాప్ మాయమైంది. తన ల్యాప్ టాప్ ను దొంగిలించి.. సాక్ష్యాలను తారుమారు చేశారని రత్నాకర్ బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసుపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
అంతకుముందు ఏం జరిగిందంటే..?
ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఫిర్యాదుతో ల్యాప్టాప్ను తిరిగి ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి బోయిన్ పల్లి పోలీసులు సూచించారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. తన అనుచరులతో మంత్రి మల్లారెడ్డి ఒక ల్యాప్టాప్ పంపించారు. అయితే.. అది తమది కాదని ఐటీ అధికారి రత్నాకర్ చెప్పారు. వేరే ల్యాప్టాప్ తెచ్చారని, తమ ల్యాప్టాప్లో విలువైన సమాచారం ఉందని తెలిపారు. మల్లారెడ్డి అనుచరులు తీసుకొచ్చిన ల్యాప్ టాప్ తీసుకునేందుకు నిరాకరించారు. తర్వాత నిన్న ఉదయం 3 గంటల 30 నిమిషాల సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్ను తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్ లోపలికి వారిని అనుతించకపోవడంతో అక్కడే ఉన్న ప్రహరీ గోడ గేట్ వద్ద ల్యాప్ టాప్ పెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ ల్యాప్టాప్ను ఐటీ అధికారులు తీసుకోలేదు. పథకం ప్రకారమే ల్యాప్టాప్ను తారుమారు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ అధికారుల సూచనల మేరకు ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.