హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దర్యాప్తు షెల్ కంపెనీల గుట్టు విప్పుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మనీలాండరింగ్ లెక్కలు తీస్తోంది. హవాలా రూపంలో విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను బయటకు తీస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ కంపెనీలకు చెందిన ఆర్థిక లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో ఆయనపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ చార్జ్షీట్లో ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని సమాచారం. ఇదే కేసులో సౌత్ గ్రూప్లోని అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు స్టేట్మెంట్ ఆధారంగా షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్పైఈడీ దర్యాప్తు చేసింది. గచ్చిబౌలిలోని ప్రవీణ్ కుమార్ కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది. ప్రవీణ్ దేశవిదేశాల్లో మల్టీనేషనల్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, ఆయన కంపెనీల నుంచి దుబాయ్, సింగపూర్ కు హవాలా రూపంలో నగదు తరలించారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పలు షెల్ కంపెనీలకు చెందిన అకౌంట్లను పరిశీలించినట్లు సమాచారం. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రారంభించిన కొన్ని ఐటీ కంపెనీల్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఆఫీసులు కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఈడీ ఇప్పటికే గుర్తించింది.
లిక్కర్ స్కామ్లో లింకులే కారణం
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో లింకైన మనీ లాండరింగ్లో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు స్టేట్మెంట్ కీలకంగా మారింది. బుచ్చిబాబు ఆడిటింగ్ చేసిన 8 కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16న దోమలగూడలోని గోరంట్ల అసోసియేట్స్, అంబర్పేట్, అమీర్పేట్, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రాంగూడ, రామంతపూర్లోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో సోదాలు చేసింది. గోరంట్ల అసోసియేట్ ఉద్యోగి శ్రీధర్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. వివిధ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నించారు. సీఏ, ఆడిటర్గా ఆయన పనిచేసిన కంపెనీల వివరాలు రికార్డ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్ సహా సౌత్గ్రూప్కు చెందిన వ్యాపారవేత్తల ఆర్థికలావాదేవీలను అధికారులు సేకరించారు.
సాఫ్ట్వేర్ ముసుగులో షెల్ కంపెనీలు
లిక్కర్ స్కామ్లో చేతులు మారిన రూ.100 కోట్లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు పెట్టుబడులు వెళ్లినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన పలు సాఫ్ట్వేర్ కంపెనీల వివరాలను ఈడీ సేకరించింది. రామంతపూర్ సెజ్లో గతంలో ప్రారంభించిన కొన్ని ఐటీ ఆఫీసుల్లో ఎలాంటి యాక్టివిటీస్ జరగడం లేదని గుర్తించినట్లు తెలిసింది. కానీ ఆయా కంపెనీల బ్యాంకు క్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు మళ్లించినట్లు సమాచారం. ఇలాంటిదే ప్రవీణ్ కుమార్కు చెందిన ఓ కంపెనీ నుంచి దుబాయ్, సింగపూర్కు మనీలాండరింగ్ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే సేకరించిన ఆధారాలతో ఈ కేసులో ప్రవీణ్ కుమార్పై కూడా ఈడీ చార్జిషీట్లో అభియోగాలు మోపే అవకాశాలు ఉన్నాయి.