
- సూర్యాపేట జిల్లా మోతె తహసీల్దార్ ఆఫీస్లో విచారణ
మోతె (మునగాల), వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన రికార్డుల ట్యాంపరింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ కాగా తాజాగా మరో 17 మందిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే... ఓ భూమికి సంబంధించి పాత పహాణీల్లో పేర్లు లేకపోయినా మోతె తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది రికార్డులను ట్యాంపర్ చేసి ధరణిలో మిస్ అయిన సర్వే నంబర్ల కింద 11 మంది రైతులకు భూమి ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ చేశారు. ఈ విషయం కలెక్టర్ తేజల్ నందలాల్ పవార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వారం కింద తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు.
తహసీల్దార్తో పాటు నలుగురు సిబ్బంది, మీ–సేవ కేంద్ర నిర్వాహకుడు కలిసి రికార్డులను ట్యాంపర్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్ఐలు మన్సూర్ అలీ, జై నిర్మలాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని సూర్యాపేట ఆర్డీవోను ఆదేశించారు. దీంతో ఎంక్వైరీ చేసిన ఆర్డీవో ఈ వ్యవహారంలో తహసీల్దార్తో పాటు నలుగురు రెవెన్యూ సిబ్బంది, మీ –సేవ నిర్వాహకుడు, 11 మంది రైతుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.