
న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా ఫెడ్ మీటింగ్పైన ఉండనుంది. ట్రంప్ టారిఫ్ పాలసీలపై క్లారిటీ వచ్చేంత వరకు వడ్డీ రేట్లను తగ్గించమని యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా యూఎస్లో ఇన్ఫ్లేషన్ తగ్గడంతో ఫెడ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ నెల 19న ఫెడ్ పాలసీ వివరాలు వెలువడతాయి. దీంతో పాటు టారిఫ్లకు సంబంధించిన వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల కదలికలు, గ్లోబల్ ట్రెండ్స్ మార్కెట్ డైరెక్షన్పై ప్రభావం చూపనున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరికి సంబంధించి ఇండియా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా సోమవారం విడుదల కానుంది. గ్లోబల్గా చైనా రిటైల్ సేల్స్ గ్రోత్ డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వెలువడనున్నాయి. వీటితో చైనీస్ ఆర్థిక వ్యవస్థపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ వారం యూఎస్ రిటైల్ సేల్స్, ప్రొడక్షన్ నెంబర్లు కూడా వెలువడనున్నాయి. గ్లోబల్ ఈవెంట్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ మీటింగ్ ఉంది. వడ్డీ రేట్లపై ఈ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ట్రంప్ పాలసీలతో యూఎస్ ఎకానమీ రెసిషన్లోకి జారుకుంటోందన్న భయాలు పెరిగాయి. డొమెస్టిక్ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది.
రూ.30 వేల కోట్లు విత్డ్రా..
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్ నుంచి నికరంగా రూ.30 వేల కోట్లను విత్డ్రా చేసుకున్నారు. గ్లోబల్గా ట్రేడ్ వార్ నడుస్తుండడంతో మన మార్కెట్లో షేర్లను అమ్మేస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నికరంగా రూ.34,574 కోట్లు, జనవరిలో రూ.78,027 కోట్లను విత్డ్రా చేసుకున్నారు.