
ముంబై: ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ల్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడకపోవడం తమకు అతి పెద్ద సవాలని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే అన్నాడు. దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తామన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో వెన్ను నొప్పికి గురైన బుమ్రా ఆ తర్వాత జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ బరిలోకి దిగలేదు. ప్రస్తుతం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉన్నాడు.
అయితే అతను కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందనే దానిపై నిర్ధిష్ట సమాచారం లేదు. ‘బుమ్రా ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు. అతని ఫీడ్ బ్యాక్ను పరిశీలించాల్సి ఉంది. పురోగతి బాగానే ఉందని అంటున్నారు. మంచి ఉత్సాహంతోనే కనిపిస్తున్నాడు. కానీ ఫిజియోలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అతను లేకపోవడం మాకు అతిపెద్ద సవాలు’ అని జయవర్ధనే పేర్కొన్నాడు.
మరోవైపు చెన్నై సూపర్కింగ్స్తో ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్లో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ మ్యాచ్ సస్పెన్షన్ పడింది. దీంతో తొలి మ్యాచ్కు అతను అందుబాటులో ఉండటం లేదని ఫ్రాంచైజీ తెలిపింది.