
- కోహ్లీ, రింకూ సింగ్తో కలిసి స్టెప్పులేసిన షారూక్
- ఫ్యాన్స్ను ఉర్రూతలూగించిన ర్యాప్ సింగ్ కరణ్ ఔజ్లా
కోల్కతా: ఐపీఎల్–18 ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో శనివారం జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో.. ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అంటూ శ్రేయా ఘోషల్ మధురమైన గాత్రంతో అలరిస్తే.. ‘లుట్ పుట్ గయా’ అని కింగ్ ఖాన్ షారూక్, రింకూ సింగ్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మధ్యలో దిశా పటానీ అందచందాలతో ఫ్యాన్స్ను మంత్రముగ్దులను చేయగా, ర్యాప్ సింగర్ కరణ్ ఔజ్లా తన ఆటా పాటలతో అభిమానులను మైమరపించాడు. వేదికపైన షారూక్ చేసిన ప్రసంగం అహూతులను అలరించింది.
పటాన్ సినిమాలోని ‘మేరీజాన్’ పాటకు కింగ్ కోహ్లీతో కలిసి వేసిన తన ట్రేడ్ మార్క్ స్టెప్పులకు ఈడెన్ చప్పట్ల మోతతో మార్మోగింది. లీగ్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడంటూ షారూక్.. కోహ్లీని అభినందించాడు. రింకూ జనరేషన్ బోల్డ్.. విరాట్ జనరేషన్ గోల్డ్ అంటూ పొగడ్తలు గుప్పించాడు. శ్రేయ పాడిన దేశభక్తి గీతానికి వందేమాతరం, వందేమాతరం అంటూ స్టేడియం ప్రతిధ్వనించింది. బాణా సంచా వెలుగులో చేసిన నృత్యాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ కూడా ఫ్యాన్స్ను కట్టిపడేశాయి. చివర్లో కోహ్లీకి ఐపీఎల్–18 మెమోంటోను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రదానం చేశారు. ఆ తర్వాత బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్తో కలిసి బిన్నీ.. ఐపీఎల్–18 కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.