
- ఐపీఎల్ టికెట్లకు అవే ఇక్కట్లు!
- తక్కువ రేటు పాసులు నిమిషాల్లోనే ఖతం
- ఎంత ప్రయత్నించినా బుక్ అవ్వక ఫ్యాన్స్ నిరాశ
- ఫస్ట్ మ్యాచ్కు భారీగా రేటు పెంచిన సన్ రైజర్స్
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ వస్తుందంటే హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో జోష్ అమాంతం పెరుగుతుంది. ఈ నెల 22 నుంచి లీగ్ ఆరంభం కానుండగా.. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ 23న రాజస్తాన్ రాయల్స్తో జరగనుంది. ఆ మ్యాచ్తో పాటు ఈ నెల 27న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్ టికెట్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం డిస్ట్రిక్ట్ (జొమాటో) ప్లాట్ఫామ్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఆన్లైన్లో పెట్టిన నిమిషాల్లోనే తక్కువ ధర టికెట్లన్నీ (రూ. 750) అమ్ముడైనట్టు చూపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. రూ.1550, రూ.1650, రూ. 1850 వంటి కనీస ధరల టికెట్లు ఎంత ప్రయత్నించినా బుక్ అవ్వలేదని అభిమానులు వాపోతున్నారు.
గత సీజన్ల మాదిరిగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వాహకులు టికెట్లను బ్లాక్ చేశారని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ దాదాపు 40 వేలు కాగా ఎన్ని టికెట్లను విక్రయానికి పెట్టారనే దానిపై స్పష్టత లేదు. అదే సమయంలో ఈ సీజన్లో టికెట్ల ధరలను కూడా సన్ రైజర్స్ పెంచింది. రాజస్తాన్తో తొలి మ్యాచ్ పాసుల ధరలను దాదాపు 50 శాతం పెంచడం గమనార్హం. 27న లక్నోతో జరిగే రెండో మ్యాచ్కు ఈస్ట్, వెస్ట్ స్టాండ్లలోని గ్రౌండ్ ఫ్లోర్ టికెట్ ధర ట్యాక్స్లేకుండా రూ. 2750.
తొలి మ్యాచ్కు ఇదే టికెట్ను సన్రైజర్స్ ఏకంగా రూ. 4500కు విక్రయిస్తోంది. సౌత్ పెవిలియన్ రెండో ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధర రెండో మ్యాచ్కు రూ. 20 వేలు అయితే... ఫస్ట్ మ్యాచ్కు రూ. 30 వేలు ఉండటం గమనార్హం. గత సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్కు సన్ రైజర్స్ ఇలానే ఉన్నట్టుండి రేట్లను పెంచింది. ఇదే పంథాను కొనసాగిస్తూ ఈ సీజన్లోనూ ప్రత్యర్థి జట్టును బట్టి టికెట్ల ధరలను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. అంతగా ఫాలోయింగ్ లేని రాజస్తాన్తో మ్యాచ్కే ఇంత మొత్తంలో ధరలు పెంచితే ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ వంటి టాప్ టీమ్స్తో మ్యాచ్లకు టికెట్ల ధరలతో అభిమానులకు షాకివ్వడం ఖాయమే అనొచ్చు.