![తెలంగాణ కొత్త డీజీపీ జితేందర్](https://static.v6velugu.com/uploads/2024/07/ips-officer-jitender-appointed-as-telangana-dgpjpg1_7BikHFofhy.jpg)
- హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త
- స్వస్థలం పంజాబ్ లోని జలంధర్
- ఏపీ కేడర్ లో 1992 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్
- నిర్మల్ ఏఎస్పీగా కెరీర్ ప్రారంభం
- 2025 సెప్టెంబరులో పదవీ విరమణ!
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీగా డాక్టర్ జితేందర్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జితేందర్ ప్రస్తుతం డీజీపీ హోదాలోనే హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. పంజాబ్ లోని జలంధర్ లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నిర్మల్ ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. నక్సలైట్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న సమయంలో మహబూబ్నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కీలక పాత్ర పోషించారు. జితేందర్ 2004 నుంచి 2006 వరకు ఢిల్లీ సిబీఐ, గ్రేహౌండ్స్తో కలిసి పనిచేశారు. తరువాత ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) గా పదోన్నతి పొందారు. ఆ సమయంలో విశాఖపట్నంలో బాధ్యతలు చేపట్టారు.
అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరు లో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 14 నెలలపాటు కొనసాగే అవకాశముంది.
ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ని క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు.
ALSO READ | తెలంగాణలో కాంగ్రెసోళ్లు పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్