
- వెపన్స్ దాచిన సొరంగం వీడియో రిలీజ్
- ట్రంప్ అల్టిమేటం నేపథ్యంలో రెండు దేశాల మధ్య టెన్షన్
టెహ్రాన్: భూగర్భంలో దాచిన ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇరాన్ బుధవారం బయటపెట్టింది. సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ టాప్ మిలిటరీ కమాండర్, మేజర్ జనరల్ మహమ్మద్ హుస్సేన్ బఘేరి, ఏరోస్పేస్ చీఫ్ అమీర్ అలీ హజిజాదేతో కలిసి ఈ రహస్య స్థావరాన్ని సందర్శించినట్లు ప్రకటించింది. 85 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఖైబర్ షేకన్, గదర్ హెచ్, సెజ్జిల్ వంటి ఖండాంతర క్షిపణులు, యుద్ధ విమానాలతోపాటు అన్ని రకాల వెపన్స్ను, వాటన్నింటినీ నిల్వ చేసేందుకు వీలున్న ‘మిసైల్ సిటీ’ అని పిలిచే విస్తారమైన భూగర్భ సొరంగాన్ని చూపించారు. అమెరికా, ఇజ్రాయెల్తో విభేదాలు పెరుగుతున్న వేళ ఇరాన్ తన వ్యూహాత్మక స్థావరాన్ని ప్రదర్శంచింది. తద్వారా అమెరికాకు ఇరాన్ తన ధిక్కారాన్ని చూపించినట్లయింది. ఈ స్థావరం పర్షియన్ గల్ఫ్లో భూమిలోపల అరకిలోమీటర్ కింద ఉందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించినా ఈ సిటీని ఛేదించడం సాధ్యంకాదని చెప్తున్నాయి.
హౌతీలకు ఇరాన్ మద్దతిచ్చుడే అసలు సమస్య?
ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతీకారంగా అమెరికా యెమెన్పై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ గొడవలకు స్వస్తి పలికేందుకు ట్రంప్ అధికారంలోకి రాగానే ఇరాన్పై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగానే మార్చి మొదటివారంలో ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. యురేనియం నిల్వలు, మిసైళ్ల కెపాసిటీ, న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించుకునేలా ఉన్న ఓ కొత్త న్యూక్లియర్ ఒప్పందంపై సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు నెలల డెడ్లైన్ విధించారు. కుదరదంటే కఠిన చర్యలు తప్పవని, సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ డిమాండ్లను ఇరాన్ తిరస్కరించింది. దేశ భద్రతకు న్యూక్లియర్ నిల్వలు ఉండాల్సిందేనని వాదించింది. దీంతో అమెరికా.. మిడిల్ ఈస్ట్లో భద్రత, నిఘా పెంచింది. ఎర్ర సముద్రంలో విమాన వాహక నౌకలను మోహరించింది. ఇరాన్ కూడా దీటుగా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. అందులో
భాగంగానే మిసైల్ సిటీ వీడియోను రిలీజ్ చేసింది.