ఇండియా ఫ్రీడం కోసం పోరాడిన ఐర్లాండ్ మహిళ 

ఇండియా ఫ్రీడం కోసం పోరాడిన ఐర్లాండ్ మహిళ 

హోంరూల్​ ఉద్యమం

అమెరికా అధ్యక్షుడు ఉండ్రో విల్సన్​ ప్రకటించిన 14 సూత్రాల స్ఫూర్తితో ఐర్లాండ్​లో హోంరూల్ ఉద్యమం ప్రారంభమైంది. ఐరిష్​ జాతీయవాదులు స్వయం పాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపట్టారు. ఈ సమయంలో అనిబిసెంట్ ఐర్లాండ్​లో ఉంది. ఈ తరహా ఉద్యమం భారతదేశానికి చాలా అవసరమని భావించిన అనిబిసెంట్​ హోంరూల్​ భావనను భారతదేశానికి తీసుకువచ్చింది. అతివాద నాయకుడు బాల గంగాధర్​ తిలక్ ​ హోంరూల్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 1916లో తిలక్​, అనిబిసెంట్​ నాయకత్వంలో భారతదేశంలో రెండు వేర్వేరు హోంలీగ్​లు ప్రారంభమయ్యాయి. అయినా వీరు ఉద్యమాన్ని సంయుక్తంగా నిర్వహించారు. స్వదేశీ, జాతీయ విద్యా విధానం, భారతదేశానికి స్వయంపాలన అనేవి ఈ లీగ్​ నినాదాలు. హోంరూల్​ ఉద్యమానికి పరోక్ష కారణం మొదటి ప్రపంచ యుద్ధం. 

విదేశాల్లో హోంరూల్​ లీగ్​

కెనడా, ఆస్ట్రేలియాల్లో హోంరూల్​ లీగ్​, న్యూయార్క్​లో ఇండియన్ హోంరూల్​ లీగ్​లు స్థాపించారు. బాల గంగాధర్​ తిలక్​ 1919, ఫిబ్రవరి 9 నుంచి మే 6 వరకు అమెరికాలో పర్యటించి ఉద్యమ ప్రచారం చేశారు. లాల లజపతిరాయ్​, హార్దికర్​, కేడీ శాస్త్రిలు కూడా అమెరికాను సందర్శించారు. 

లక్నో సమావేశం

1916, లక్నో సమావేశానికి  ఏసీ మజుందార్​ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

1. లక్నో కలయిక: మితవాదులు, అతివాదులు కలవడంలో అనిబిసెంట్​, తిలక్​ ప్రముఖ పాత్ర పోషించారు. 1907లో విడిపోయిన అతివాదులు, మితవాదులు కలవడంతో జాతీయ కాంగ్రెస్​ శక్తిమంతమైంది. ఇందులోనే తిలక్​, ఆయన అనుచరులు ఐఎన్​సీలో చేరారు. 

2. లక్నో ఒప్పందం: కాంగ్రెస్​, ముస్లింలీగ్​ల మధ్య రాజ్యాంగ సంస్కరణల విషయమై జరిగిన ఒడంబడికలో భాగంగా కాంగ్రెస్​, ముస్లింలీగ్​లు ఒక ఒప్పందాన్ని చేసుకుని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. లక్నో ఒప్పందానికి ప్రధాన కారకుడు మహ్మద్​అలీ జిన్నా. ఇతనికి హిందూ ముస్లింల ఐక్యతకు రాయబారి అని పేరు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్​ కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా హోంరూల్​ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ముస్లిం లీగ్​ నాయకుడైన జిన్నా హోంరూల్​ లీగ్​లో చేరి బొంబాయి శాఖకు ప్రాతినిధ్యం వహించారు. 

ఉద్యమ ఫలితాలు

    ప్రజలలో రాజకీయ చైతన్యం, జాతీయ స్ఫూర్తి ఏర్పడటం

    జాతీయవాదులు, మితవాదులు, కాంగ్రెస్​, ముస్లింలీగ్​ కార్యకర్తలు అందరూ కలసి పాల్గొనడం

    ప్రభుత్వ భారత ప్రభుత్వ చట్టాన్ని (1919) ఆమోదించడం

    1919 చట్టంతో భారతీయులకు కొంత మేరకు ప్రభుత్వ నిర్వహణలో పాల్గొనే అవకాశం

    1920లో హోంరూల్​ లీగ్​కు గాంధీజీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆల్​ ఇండియా హోమ్​ రూల్​ లీగ్​ అనే స్వరాజ్యసభగా పేరు మార్చుకుంది.

అనిబిసెంట్​ హోంరూల్​ లీగ్​: 1916, సెప్టెంబర్​లో అనిబిసెంట్​ మద్రాస్​ ప్రాంతంలోని గోఖలే హాల్​లో హోంరూల్​ లీగ్​ను స్థాపించి, ఆ సంస్థకు ఆమెనే అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఏడుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్​లో కార్యనిర్వాహక కార్యదర్శి జార్జి అరుండేల్​, ఉపాధ్యక్షుడు రామస్వామి అయ్యర్​, కోశాధికారిగా బీడబ్ల్యూ వాడియాను నియమించారు. లీగ్​ ప్రథమ సమావేశంలో వాడియా హోంరూల్​ లీగ్​ అనే అక్షరాలతో కూడిన బంగారు బ్యాడ్జిని అనిబిసెంట్​కు బహూకరించారు. చార్లెస్ బ్రాడ్​లా పరిచయంతో అనిబిసెంట్​ సోషలిస్టు భావాలను అందిపుచ్చుకున్నారు. ఈ ఉద్యమంలో అనిబిసెంట్​కు జమునదాస్​, ద్వారకదాస్​, మోరేశ్వర్​ అభ్యంకర్​, ఇందూలాల్​ యాజ్ఞిక్​, జార్జి అరుండేల్​, మోతీలాల్​ నెహ్రూ, చక్రవర్తి, బెనర్జీ సహకరించారు. ఈ ఉద్యమంలో జవహర్​లాల్​ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నారు. 1916లో హోంరూల్​ ఉద్యమంలో భాగంగా అనిబిసెంట్​ ఆంధ్ర రాష్ట్రంలోని మదనపల్లిలో జాతీయ కళాశాల లేదా థియోసాఫికల్​ కళాశాలను స్థాపించారు.

ఈ కళాశాల మొదటి ప్రిన్సిపల్​ హె.జె.కజిన్స్​. వారణాసిలో వారణాసి సంస్కృత విద్యాపీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1917లో డిఫెన్స్​ ఆఫ్ ఇండియా యాక్ట్​ కింద అనిబిసెంట్​ను అరెస్టు చేశారు. ఉద్యమ తీవ్రతను గమనించి 1917, ఆగస్టు 20న ఆనాటి బ్రిటీష్​ ప్రభుత్వ కార్యదర్శి మాంటేగ్​ ఛేమ్స్​ఫర్డ్​ దశల వారీగా భారతీయులకు అధికారాలు సంక్రమింపజేస్తామని ప్రకటన చేశాడు. దీన్నే ఆగస్టు లేదా మాంటేగ్​ ప్రకటన అంటారు. ఈ ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తూ అనిబిసెంట్​ ఉద్యమాన్ని నిలిపివేసింది. కానీ తిలక్​ ఉద్యమాన్ని కొనసాగించారు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో హోంరూల్​ ఉద్యమం కూడా ముగిసింది. ఆగస్ట్​ డిక్లరేషన్​ను సురేంద్రనాథ్​ బెనర్జీ ఆహ్వానించారు. దానిని మాగ్నాకార్టాగా అభివర్ణించారు. కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి 1917లో ఇండియన్ లిబరల్​ ఫెడరేషన్​ను ఏర్పాటు చేశారు. 

తిలక్​ హోంరూల్​ లీగ్​: 1908లో అరెస్టయి మాండలే  కారాగారంలో జైలు జీవితం అనుభవించిన​ తిలక్​ 1914, జూన్​లో విడుదలయ్యారు. ఆ సమయంలో పాండిచ్చేరిలో అరబిందో ఘోష్​ సన్యాసిగా, లజపతిరాయ్​ అమెరికాలో ఉన్నారు. 1915, ఏప్రిల్​ 20న తిలక్​ బొంబాయి రాష్ట్ర రాజకీయ సమ్మేళన ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1915లో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్​ షా మెహతాలు మరణించడంతో తిలక్​కు మళ్లీ కాంగ్రెస్​లో చేరే అవకాశం లభించింది. తిలక్​ స్థాపించిన హోంరూల్​ లీగ్​ మహారాష్ట్ర (బొంబాయి మినహా), కర్ణాటక, మధ్యప్రదేశ్​, బీరార్​ ప్రాంతాలకే పరిమితమైంది. హోంరూల్​ అనేది బ్రిటీష్​ సామ్రాజ్యంలో అంతర్భాగమని, అందులో ఆంగ్ల అధికారుల స్థానంలో ప్రజలకు బాధ్యత వహించే అధికారులు ఉంటారని తెలిపారు.