గోదావరి కరకట్ట స్లూయిజ్​లకు సీసీ కెమెరాలు

గోదావరి కరకట్ట స్లూయిజ్​లకు సీసీ కెమెరాలు
  • భద్రాచలంలో ఇరిగేషన్​ ఇంజినీర్ల సూపర్​వైజేషన్​

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపై స్లూయిజ్​ల వద్ద ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎక్కడి నుంచైనా కరకట్టను ఈ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. భారీ వర్షాలతో వేగంగా ఊరిన డ్రైన్​వాటర్​ మొత్తం రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ సమీపాన ఉన్న స్లూయిజ్​కు చేరుకుంటుంది.

మోటార్లు సకాలంలో ఆన్​ చేయకపోతే ఆ నీరు రామాలయం పరిసరాలను ముంచెత్తుతుంది. అర నిముషం ఆలస్యమైనా ముప్పు ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పరిశీలించి స్టాఫ్​ను అలర్ట్ చేయడానికి వీలుంది. సీసీ కెమెరాల ఫుటేజ్​ ఎప్పటికప్పుడు తమకు తెలిసేలా ఇరిగేషన్​ ఈఈ, ఇతర సిబ్బంది సెల్​ ఫోన్లకు వాటిని అనుసంధానం చేశారు. 

ఆ రెండే కీలకం..

1998లో గోదావరి వరదల నుంచి భద్రాచలం టౌన్​ను కాపాడేందుకు రూ.15కోట్ల వ్యయంతో కరకట్టలు నిర్మించారు. కూనవరం రోడ్డు నుంచి ఎటపాక వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ కట్టలు పోశారు. ఊరిలోని డ్రైన్​ వాటర్​ బయటకు పంపేందుకు కరకట్టలపై సుభాష్​​ నగర్​ కాలనీ, విస్తాకాంప్లెక్స్, అశోక్​నగర్​ కాలనీ తదితర ప్రాంతాల్లో స్లూయిజ్​లను నిర్మించారు. వీటిలో ప్రధానంగా విస్తా కాంప్లెక్స్, అశోక్​నగర్​ కొత్త కాలనీ స్లూయిజ్​లతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

గోదావరి ఉప్పొంగగానే స్లూయిజ్​ గేట్లను మూసేస్తారు. దీనివల్ల ఊరిలో పడిన వర్షపు నీరు అంతా డ్రైన్ల ద్వారా ఇక్కడకు చేరుకుని ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. ఆ నీటిని మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు ఇరిగేషన్​ ఇంజినీర్లు గోదావరిలోకి ఎత్తిపోస్తుంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాలనీలను బ్యాక్ వాటర్​ ముంచెత్తుతుంది.

ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన విస్తాకాంప్లెక్స్, అశోక్​నగర్ కొత్తకాలనీ స్లూయిజ్​లను మానిటరింగ్​ చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెల్​ఫోన్లలోనే ఈ స్లూయిజ్​ల పరిస్థితిని సీసీ కెమెరాల పుటేజీ ద్వారా విశ్లేషించుకుంటున్నారు. మోటార్ల వద్ద ఉండే స్టాఫ్​ను ఎప్పటికప్పుడు అలర్ట్​ చేస్తున్నారు. 

నిరంతరం మానిటరింగ్..

స్లూయిజ్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడ ఉన్నా సెల్​ఫోన్ల ద్వారా మానిటరింగ్​ చేస్తున్నాం. మోటార్లను రెడీ చేసి పెట్టుకున్నాం. ఏ క్షణమైనా వాటిని ఆన్​ చేసేలా స్లూయిజ్​ల వద్ద ఉన్న స్టాఫ్​కు ఫోన్​ ద్వారా ఆదేశాలు జారీ చేస్తాం. డ్రైన్ల ద్వారా వచ్చే నీటిని బట్టి మోటార్లను ఆన్​ చేసి గోదావరిలోకి పంపింగ్​ చేస్తున్నాం.- రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం