
- రేపు జల సౌధలో వర్క్షాప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్యాముల సేఫ్టీపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టనున్నది. ఇప్పటికే డ్యాములకు ఓనర్లను నిర్ణయించి వాటి పూర్తి బాధ్యతలను ఆయా అధికారులకే అప్పగించిన ఇరిగేషన్ శాఖ.. వాటిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నది. వరద నియంత్రణ, ప్రాజెక్టుల డ్యామేజీల గుర్తింపు, గేట్ల నిర్వహణ, ప్రాజెక్టుల్లో లోపాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నది.
ఈ నేపథ్యంలోనే బుధవారం జలసౌధలో డ్యామ్ సేఫ్టీ, నీటి యాజమాన్యంలో డ్రోన్ల వినియోగంపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించనున్నది. ఈ వర్క్షాప్లో భాగంగా డ్యాముల డేటా ప్రాసెసింగ్, ప్రాజెక్టుల్లో డ్రోన్ల టెక్నాలజీ తదితర అంశాలపై చర్చించనున్నారు. డ్యామ్ ఆపరేషన్లలో డ్రోన్లను వినియోగించే తీరును వివరించనున్నారు.
ప్రాజెక్టు ప్రాంతాల స్థితిగతులను తెలుసుకోవడం, ప్రాజెక్టు ఏరియాల కబ్జా/ఆక్రమణలు, ప్రాజెక్టుల పరిశీలన వంటి వాటి గురించి తెలియజేయనున్నారు. ప్రాజెక్టుల్లో ఎంత మేర ఇసుక ఉందన్న విషయాన్ని అంచనా వేయనున్నారు. ప్రాజెక్టుల్లోని రాతి నిర్మాణాలు, డ్యామేజ్లు తెలుసుకుని వాటి డేటాను డ్రోన్ల ద్వారా ఎలా ప్రాసెస్ చేస్తారన్న విషయాలను చర్చించనున్నారు. వర్క్షాప్లో డ్రోన్లను ప్రదర్శించనున్నారు.