సూక్ష్మ సేద్యంపై ఫోకస్​ పెట్టండి

సూక్ష్మ సేద్యంపై ఫోకస్​ పెట్టండి
  • డ్రిప్, స్ప్రింక్లర్​ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించండి 
  • ఇరిగేషన్​ శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు
  • ఎస్ఎల్​బీసీ, పాలమూరు, డిండి, దేవాదుల  ప్రాజెక్టులకు డెడ్ లైన్ పెట్టుకోండి
  • రాజస్థాన్​లో జరిగే మంత్రుల కాన్ఫరెన్స్​కు ప్రజెంటేషన్​సిద్ధంచేయండి
  • పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్​

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని, సూక్ష్మ సేద్యం ద్వారా రైతులకు నీళ్లిచ్చే విషయాలపై కసరత్తు చేయాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను అరికట్టేలా డ్రిప్​ ఇరిగేషన్​ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రిప్​, స్ప్రింక్లర్​ సిస్టమ్స్​ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో డేటాను సిద్ధం చేయాలన్నారు. 

ఎస్ఎల్​బీసీ, డిండి, పాలమూరు– రంగారెడ్డి, దేవాదులతోపాటు పలు లిఫ్ట్​ స్కీమ్స్​ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా డెడ్​లైన్స్​ పెట్టుకోవాలని, ఆ టైమ్​లోపు ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు నీళ్లిచ్చేందుకు ఆ ప్రాజెక్టులు చాలా కీలకమని, వాటిపై ప్రధానంగా ఫోకస్​ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను పర్యవేక్షించాలని, బాధ్యతగా ఉండాలని అన్నారు. 

పనుల్లో నిర్లక్ష్యం వహించినా, అసమర్థంగా ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శనివారం జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. ఎస్ఎల్​బీసీ టన్నెల్​ తవ్వకం పనులను పున:ప్రారంభించామని, ఒక మీటర్​ వరకు శుక్రవారం తవ్వామని తెలిపారు. 

పెండింగ్​ బిల్లుల్లో కరెంట్​చార్జీలను మినహాయిస్తున్నారని, వాటిని కూడా చెల్లించాలని మంత్రికి అధికారులు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.  ఈ నెల 18, 19న రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరగనున్న రెండో ఆలిండియా స్టేట్​ వాటర్​ మినిస్టర్స్​ కాన్ఫరెన్స్​ 2025పైనా అధికారులతో మంత్రి ఉత్తమ్​ చర్చించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడం, పెండింగ్​ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలపై కాన్ఫరెన్స్​లో తెలంగాణ తరఫున ప్రజెంటేషన్​ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రజెంటేషన్​ను సిద్ధం చేయాలని అధికారులను ఉత్తమ్​ ఆదేశించారు.  

తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టులకే ప్రాధాన్యం

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, 30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో నీటి నిల్వను పెంచే విషయాలపైనా ఫోకస్​ పెట్టాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, నదుల అనుసంధానం, గ్రౌండ్​ వాటర్​ను మెరుగుపరచడంలాంటి వాటితో దీర్ఘకాలంలో నీటి కొరత రాకుండా ఉంటుందని పేర్కొన్నారు.

 రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్ల నిర్వహణపై ఓ నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. కాగా, ఈ సమావేశంలో ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా, స్పెషల్​ సెక్రటరీ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​, ఇరిగేషన్​ అడ్వైజర్​ ఆదిత్యనాథ్​ దాస్​, ఈఎన్సీ అనిల్​ కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్​, సీఈలు అజయ్​ కుమార్, రమేశ్​ బాబు, శ్రీనివాస్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.