
కొలంబో: మూడు దేశాల వన్డే సిరీస్లో ఇండియా విమెన్స్ టీమ్ రెండో మ్యాచ్కు రెడీ అయ్యింది. మంగళవారం (April 29) జరిగే పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. గత మ్యాచ్లో లంకపై మూడు విభాగాల్లో రాణించిన టీమిండియా ఇందులోనూ ఆ జోరు కొనసాగించాలని భావిస్తోంది. స్పిన్నర్లు స్నేహ్ రాణా, దీప్తి శర్మ, శ్రీ చరణి నేతృత్వంలోని బౌలర్లు లంకను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు అదే ఫార్ములాను సఫారీలపై కూడా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాటింగ్లో ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ ఆకట్టుకున్నారు. వీళ్లకు తోడుగా మిగతా వారు కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. ఈ రెండు విభాగాలకు తోడుగా ఫీల్డింగ్లోనూ టీమిండియా మెరవడం సానుకూలాంశం. డబ్ల్యూపీఎల్లో ఆడటం ద్వారా ఇండియాకు మంచి ప్రాక్టీస్ లభించినా ఈ సిరీస్ ద్వారా వన్డే వరల్డ్ కప్కు టీమ్ను రెడీ చేయాలని మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక మార్చి 2022 నుంచి ఈ ఫార్మాట్లో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్లోనూ ఓడలేదు. అదే కాన్ఫిడెన్స్తో సఫారీలు ఈ మ్యాచ్కు రెడీ అయ్యారు. ఇరుజట్ల మధ్య చివరిసారిగా జరిగిన సిరీస్లో ఇండియా 3–0తో సౌతాఫ్రికాను ఓడించింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటీస్ లెక్కలేస్తోంది. అయితే సీనియర్ ఆల్రౌండర్ మారిజేన్ కాప్ ఈ సిరీస్లో ఆడకపోవడం కాస్త మైనస్గా కనిపిస్తోంది.
సునె లూస్, లారా వోల్వర్త్, చోలే ట్రయాన్, మసబటా క్లాస్కు తోడు ఆల్రౌండర్స్ అనెరీ డెరెక్సెన్, డి క్లెర్క్ పేస్ బౌలింగ్ బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. కొత్త కోచ్ మాండ్లా మషింబే స్ట్రాటజీలపై ఎక్కువగా దృష్టి ఉంది. ఓవరాల్గా లంకపై గెలుపుతో తమ వరుస విజయాల రికార్డును ఏడుకు పెంచుకున్న టీమిండియా దాన్ని కొనసాగిస్తుందా? లేదా? చూడాలి.