![బుమ్రా భవిష్యత్తు తేలేది నేడే?](https://static.v6velugu.com/uploads/2025/02/is-jasprit-bumrah-fit-for-champions-trophyboards-final-decision_pu2KYUBIrA.jpg)
బెంగళూరు : టీమిండియా స్టార్ పేస్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్, చాంపియన్స్ ట్రోఫీలో అతను పాల్గొనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల 19న మొదలయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీకి తుది జట్ల జాబితాను సమర్పించడానికి మంగళవారమే చివరి రోజు. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనే అంశంపై బోర్డు మరి కొన్ని గంటల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. వెన్ను నొప్పితో ఆటకు దూరమైన బుమ్రా ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో స్కాన్ చేయించుకున్నాడు.
ఫిట్నెస్ టెస్టుకూ హాజరైనట్టు తెలుస్తోంది. మెగా టోర్నీలో బుమ్రాను ఆడించడంపై నిర్ణయం తీసుకునే ముందు బీసీసీఐ మెడికల్ స్టాఫ్.. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ తో సమన్వయం చేస్తున్నట్టు సమాచారం. గత నెల 18న చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన ప్రాథమిక జట్టులో బుమ్రా పేరును కూడా చేర్చారు. కానీ, చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో బుమ్రా పాల్గొనలేదు. బుధవారం అహ్మదాబాద్లో జరిగే మూడో వన్డేలో అయినా ఆడొచ్చని భావించినా.. తను ఇంకా బెంగళూరులోనే ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడే చాన్స్ లేదని బీసీసీఐ భావిస్తే అతని స్థానంలో హర్షిత్ రాణాను జట్టులో చేర్చవచ్చు. అదే సమయంలో చివరి దశలో బరిలోకి దిగొచ్చని అనుకుంటే 15 మందితో కూడిన జాబితాలో బుమ్రాను కొనసాగించనుంది. అవసరం అయితే ఐసీసీ ఆమోదంతో అతని స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసే అవకాశం ఉంటుంది.