
విద్యాసాగర్ (కలకత్తాలోని సంస్కృత కళాశాల ప్రదానం చేసింది), పండిట్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా, ఛాంపియన్ ఆఫ్ వుమెన్ అనే బిరుదులు పొందారు. ఇతను నడిపిన పత్రిక పేరు సోంప్రకాశ్ (బెంగాలీ). విద్యాసాగర్ బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు. ఈయన బెంగాలీ ప్రాథమిక వాచకాన్ని రూపొందించారు. ఇతను రాసిన బోర్నో పరిచయ్ అనే పుస్తకం బెంగాలీ అక్షరాలను నేర్చుకోవడానికి పరిచయ పుస్తకంగా ఉపయోగపడుతుంది. ఉపక్రమోనిక, వ్యాకరణ కౌముది అనే రెండు గ్రంథాలను, కఠినమైన సంస్కృత వ్యాకరణాన్ని, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి బెంగాలీ భాషలో రాశాడు.
సాంఘిక సంస్కరణలు
బాలికల విద్య కోసం జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ ఆర్థిక సహాయంతో కలకత్తాలో 1849లో ఏర్పాటు చేసిన బెతూనే పాఠశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా, సెక్రటరీగా ఉన్నారు. హిందూ మహిళా పాఠశాలను మార్చి బెధూనే పాఠశాలగా ఏర్పాటు చేయగా, ఇది తర్వాత కాలంలో కళాశాలగా మార్పు చెంది భారతదేశంలో కాకుండా ఆసియాలోనే మొదటి మహిళా కళాశాలగా పేరుపొందింది.
భారతదేశంలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయిన కాదంబిని గంగూళి ఈ కళాశాల నుంచే పట్టా పొందారు. వితంతు పునర్వివాహ ఉద్యమాన్ని, పునర్వివాహ సొసైటీని బెంగాల్లో ప్రారంభించాడు. ఫలితంగా జె.పి.గ్రాంట్ వితంతు పునర్వివాహ బిల్లును ప్రవేశపెటాడు. 1856లో చేసిన హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఇతడి కృషికి నిదర్శనం.
ఇతను దేశంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని 1856లో కలకత్తాలో జరిపించాడు. ఇతడు అనేక బాలికల పాఠశాలలను స్థాపించడంతోపాటు బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. సుమారు 20ఏండ్లపాటు నందన్ కానన్ (జార్ఖండ్) అడవుల్లోని సంతాల్ తెగలతో గడిపాడు.