గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్​.. 50 మంది మృతి

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్​.. 50 మంది మృతి
  • హమాస్ ​లక్ష్యంగా భూ, గగనతల దాడులు
  • బాంబుల మోతతో దద్దరిల్లిన  జబాలియా నార్త్​ఎన్​క్లేవ్

కైరో: హమాస్​ మిలిటెంట్ ​సంస్థను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్​ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ​మిలిటరీ(ఐడీఎఫ్​) భూ, గగనతలం నుంచి విరుచుకుపడగా బాంబుల మోతతో గాజా మరోసారి దద్దరిల్లింది.  ఉత్తర గాజాలోని జబాలియా  నార్త్​ఎన్​క్లేవ్​ను మంగళవారం ఐడీఎఫ్​ చుట్టుముట్టి జరిపిన దాడిలో గాజా స్ట్రిప్​లో 50 మంది చనిపోయారు. ఆల్​ఫలౌజియా శరణార్థ శిబిరంలో 17 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఖాన్​యూనిస్​కు ఉత్తరాన ఉన్న బనీ సుహైలాలోని 10 మంది మృతి చెందినట్టు వివరించింది.

పది రోజులనుంచి జబాలియాలో బాంబుల మోత 

జబాలియాపై ఇజ్రాయెల్ ఆర్మీ పది రోజులుగా విరుచుకుపడుతోంది. యుద్ధ ప్రారంభ సమయంలో బాంబుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంపై ఐడీఎఫ్​ మళ్లీ గురిపెట్టింది. ఇప్పటివరకూ డజన్ల కొద్దీ ఇండ్లను ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. 10 రోజుల కిందటే ఈ ప్రాంతంలో ఆపరేషన్​ ప్రారంభమైందని, హమాస్​ బలపడకుండా చూడడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. కాగా, ఉత్తర ఎన్​క్లేవ్​లోని ప్రజలను ఇక్కడి నుంచి పంపించేందుకే ఇజ్రాయెల్ దాడి చేస్తోందని పాలస్తీనా ఆరోపిస్తున్నది. వెళ్లిపోయిన వాళ్లను తిరిగి రానివ్వరని హెచ్చరించింది. కాగా, గాజా స్ట్రిప్ ​నుంచి ఉత్తర గాజాను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్​ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నదని యూఎన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులను తరిమేసిన యుద్ధం

హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్​ దాడులతో లెబనాన్​లో నెత్తురు పారుతున్నది. దాదాపు ఏడాదినుంచి యుద్ధం కొనసాగుతుండగా.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెలుతున్నారు. ఇప్పటివరకూ సుమారు 12 లక్షల మంది బీరుట్ సరిహద్దుల్లోని ప్రాంతాలకు వెళ్లారు.  3 వారాల్లోనే లెబనాన్​నుంచి 4 లక్షలకు పైగా చిన్నారులు వెళ్లారని యూఎన్​ తెలిపింది.