ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 22 మంది మృతి

 ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 22 మంది మృతి

గాజా స్ట్రిప్: ఉత్తర గాజాపై ఆదివారం ఇజ్రాయెల్​ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తం 22 మంది మృతిచెందారని,  ఇందులో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. బీట్​లాహియాలో పట్టణంలోని నివాస గృహాలు, భవనాలపై శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్​ సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కన్నుమూసినట్టు పేర్కొన్నారు.

  మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 3 కుటుంబాలకు చెందినవారే అని పేర్కొన్నారు. కాగా, తాము  ఓ నివాస భవనంలో తలదాచుకున్న టెర్రరిస్టులే టార్గెట్​గా దాడి చేశామని,  పౌరులకు హాని కలగకుండా చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్​ సైన్యం తెలిపింది. పౌరులు మృతిచెందినట్టు తప్పుడు సంఖ్యలను మీడియా సృష్టిస్తున్నదని పేర్కొన్నది.