
2023లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పలు ప్రయోగాలను చేపట్టింది. పీఎస్ఎల్వీ సీ-54, పీఎస్ఎల్వీ సీ-55, పీఎస్ఎల్వీ సీ-56 ద్వారా స్వదేశీ ఉపగ్రహాలతోపాటు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో విజయవం తంగా ప్రవేశపెట్టింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం బలోపేతం కోసం రూపొందించిన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్-12 విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అలాగే, చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీను విజయవం తంగా రూపొందించి ప్రయోగించింది.
పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక 2023, జులై 29న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంట్(షార్) నుంచి ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్ నాలుగు దశల్లో సింగపూర్కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోల బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్(షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కిలోల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్ , 3.84 కిలోల గలాసియా–2, 4.1 కిలోల స్కూబ్–11, 3.05 కిలోల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు షార్ నుంచి ఇది 90వ ప్రయోగం.
పీఎస్ఎల్వీ సీ-54 ఇస్రో శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 2022, నవంబర్ 26న ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ–54 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన 1,117 కిలోల బరువున్న ఈఓఎస్ –06, 18.28 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలో బరువున్న రెండు థాయ్ బోల్ట్ శాటిలైట్స్తోపాటు 17.92 కిలోల బరువున్న 4 యూఎస్కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూ వాతావరణంపై పీఎస్ఎల్వీ సీ–54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
జీఎల్ఎల్వీ ఎఫ్-12
ఇస్రో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2023, మే 29న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2232 కిలోల బరువున్న ఎన్వీఎస్–01 జీవిత కాలం 12 ఏళ్లు. నావిగేషన్ శాటిలైట్ సిస్టం బలోపేతం కోసం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ(ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్–01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించారు. నావిక్–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్–5, ఎస్–బాండ్ల సిగ్నల్స్తో పనిచేసేలా రూపొందించారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, ఇంటర్నెట్తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకూ దోహదపడుతుంది.
అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం
పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్లోని నాలుగో దశ (పీఎస్-4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్-4 అక్కడి నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాలు తదుపరి చెత్త తొలగిస్తుంది.
ఎస్ఎస్ఎల్వీ డీ2
ఇస్రో శాస్త్రవేత్తలు మొదటిసారిగా చిన్న ఉపగ్రహ వాహకనౌకను (ఎస్ఎస్ఎల్వీ) రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు. తిరుపతి జిల్లాలోని షార్లో ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రోకు 156.3 కిలోల బరువు గల ఈవోఎస్–07 ఉపగ్రహంతోపాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జామస్–1, చెన్నై స్పేస్ క్విడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్ –2 లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈవోఎస్-07: ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్ లక్ష్యం మైక్రోశాటిలైట్, కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, భవిష్యత్తులో ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ఎంతో అవసరం కానుంది.
ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులు గుర్తించవచ్చు.
జానుస్-1: బరువు 10.2 కిలోలు. అంటా రిస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫారం ఆధారంగా రూపొందిన శాటిలైట్ మిషన్ ఇది.
ఆజాదీ శాట్-2: బరువు 8.7కిలోలు.
ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 750 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీన్ని చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు.