
తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన GSLV మార్క్ 3 ప్రయోగం విజయవంతమైంది. వన్వెబ్ ఇండియా–2 పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను ‘ఎల్ వీఎం 3’ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్టులు విషెస్ తెలుపుతున్నారు. ఈ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనుంది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగానికి బ్రిటన్కు చెందిన వన్వెబ్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెండో దశలో 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 ద్వారా పంపారు. ఒక్కొక్క ఉపగ్రహం బరువు 150 కిలోలు.
అంతకు ముందు ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు.