డెస్క్, వెలుగు: రెవెన్యూలో, ఉద్యోగాలను ఇవ్వడంలో ఇప్పటి వరకు దూసుకుపోయిన ఐటీ కంపెనీలకు బ్రేక్లు పడినట్టు కనిపిస్తోంది. యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు అధ్వాన్నంగా మారడంతో దేశంలోని పెద్ద ఐటీ కంపెనీలకు బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరప్, యూఎస్ క్లయింట్లపైనే ఆధారపడిన కంపెనీలు స్లోడౌన్ను ఎదుర్కోక తప్పదు. మన దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు యూఎస్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సుమారు 30 శాతం రెవెన్యూ ఈ దేశ ఫైనాన్షియల్ కంపెనీల నుంచే వస్తోంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్లోకి జారుకునే స్టేజ్లో ఉంది. దీంతో మన ఐటీ కంపెనీలకు ఇబ్బందులు మొదలవుతున్నాయి. తమ యూరప్ క్లయింట్లలో మాన్యుఫాక్చరింగ్, లైఫ్ సైన్సెస్ సెక్టార్లకు చెందిన కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్నాయని తాజాగా టీసీఎస్ తమ ఇంటర్నల్ మీటింగ్లో పేర్కొంది. యాక్సెంచర్ కూడా ఈ ఏడాది జూన్ - ఆగస్టు క్వార్టర్లో తమ అవుట్ సోర్సింగ్ బిజినెస్కు తక్కువ ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది.
ప్రస్తుతం కంపెనీలు టెక్నాలజీని మెరుగుపరుచుకునే ప్రాజెక్ట్లను చేపట్టడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. కిందటేడాది ఫార్చ్యూన్ 500 కంపెనీలు టెక్నాలజీపై భారీగా ఖర్చు చేశాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఖర్చు చేశాయి. దీంతో యాక్సెంచర్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. కానీ ప్రస్తుతం గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ రికార్డ్ లెవెల్కు చేరుకుంది. మాక్రో ఎకనామిక్ పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. దీంతో వివిధ సెక్టార్లలోని కంపెనీలు ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు టెక్నాలజీపై చేసే తమ ఖర్చులను తగ్గించేస్తున్నాయి. తమ బిజినెస్పై ఎటువంటి ఆర్థిక పరిస్థితుల ప్రభావం లేదని, కానీ, కొంత మంది క్లయింట్లు బలహీనంగా మారారని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ శేక్సారియా పేర్కొనడాన్ని గమనించాలి. ఐటీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారాయో దీని బట్టి అర్థమవుతోంది. ఐటీ కంపెనీలు తమ హైరింగ్ యాక్టివిటీని కూడా స్లో చేశాయి. యాక్సెంచర్ వరసగా రెండు క్వార్టర్లలో హైరింగ్ తగ్గించేసింది. ఐటీ కంపెనీల పరిస్థితి వచ్చే నెల ప్రకటించే క్వార్టర్లీ రిజల్ట్స్తో తెలుస్తాయని ఎనలిస్టులు అన్నారు.
ఫ్రెషర్లను తీసుకోవడంలో ఆలస్యం..
దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు తమ హైరింగ్ యాక్టివిటీని తగ్గించేస్తున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ లక్ష మందిని, ఇన్ఫోసిస్ 85 వేల మందిని, విప్రో 19 వేల మందిని, హెచ్సీఎల్ టెక్ 23 వేల మందిని నియమించుకున్నాయి. ఈ నాలుగు కంపెనీలే 2,27,000 మందికి ఉద్యోగాలిచ్చాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలన్నీ కలిసి 1,55,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ నెంబర్ 30 శాతం తగ్గడాన్ని గమనించాలి. మరోవైపు ఐటీ కంపెనీలు ఫ్రెషర్లను కంపెనీలోకి జాయిన్ చేసుకోవడం ఆలస్యం చేస్తున్నాయి. ఒక్క విప్రోనే సెలెక్ట్ చేసిన 2 వేల మంది ఫ్రెషర్లను ఇంకా కంపెనీలో జాయిన్ చేసుకోలేదు. గత కొన్ని రోజులుగా ‘#విప్రోఆన్బోర్డ్అజ్2022’ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో వైరల్ కావడాన్ని కూడా గమనించొచ్చు. చాలా మంది పెద్ద కంపెనీలకు సెలెక్ట్ అయ్యామని ఇతర కంపెనీల ఆఫర్లను వదిలేసుకున్నారు. కంపెనీల్లోకి జాయిన్ చేసుకోవడం ఈ ఏడాది మరి ఆలస్యంగా జరుగుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. అట్రిషన్ రేటు తగ్గుతుండడంతో పాటు ఉద్యోగులకు డిమాండ్ కొంత తగ్గడంతో ఈసారి ఆన్బోర్డింగ్ ఆలస్యమవుతోందన్నారు.