
పద్మారావునగర్, వెలుగు: బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లను ఏజీఎస్ ట్రాన్సాక్ట్, సెక్యూర్వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు 45 రోజులుగా తమ వద్దే ఉంచుకున్న విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. రెండు ఏజెన్సీలు రూ.7 కోట్లను గోదాముల్లో ఉంచినట్లు తెలిసింది. ఏజీఎస్ట్రాన్సాక్ట్టెక్నాలజీస్, సెక్యూర్ వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు సిటీలోని ప్రముఖ బ్యాంకుల క్యాష్ను వాటి ఏటీఎంలలో పెడుతుంటాయి. అయితే ఈ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కొందరు జీతాలు రావడం లేదంటూ ఇటీవల విధులు బహిష్కరించారు. దీంతో ఏజెన్సీలు ఏటీఎంలకు క్యాష్ పంపడం ఆగింది.
దాదాపు 45 రోజులుగా చాలా ఏటీఎంలకు క్యాష్ వెళ్లడం లేదు. ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన రూ.5 కోట్లు, మరో బ్యాంకుకు సంబంధించిన రూ.కోటి80లక్షలు ఏజెన్సీల గోదాముల్లోనే ఉండిపోయాయి. ఏజెన్సీల నిర్వాహకులతో బ్యాంకులు పలుమార్లు మాట్లాడినా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఓ బ్యాంక్అధికారి శనివారం బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఏజెన్సీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.