
బీటెక్ విద్యార్థులకే సాఫ్ట్వేర్ జాబ్స్ అనే రోజులు పోయాయ్. ఇటీవల ఐటీ సంస్థలు నాన్ టెక్నికల్ విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. స్కిల్స్ ఉంటే ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి టాప్ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపడుతున్నాయి. ఇంట్రస్ట్ ఉంటే చాలు ఎనీ డిగ్రీతో ఐటీ కొలువు సొంతం చేసుకునే అవకాశం అందిస్తున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలు చేపడుతున్న సెలెక్షన్ ప్రాసెస్, అర్హతల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు మరికొద్ది రోజుల్లో డిగ్రీ పట్టాలతో బయటకు రానున్నారు. వీరికోసం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు ట్రైనింగ్ ఇచ్చి మరీ కొలువులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్కిల్స్ ఉంటే ఐటీ జాబ్ సొంతం చేసుకునేలా శిక్షణ ఇచ్చి అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
టీసీఎస్ ‘స్మార్ట్ హైరింగ్’
ఈ ప్రోగ్రామ్కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందించి టీసీఎస్లోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు.
అర్హతలు: బీసీఏ, బీఎస్సీ, ఒకేషనల్ (సీఎస్ అండ్ ఐటీ) కోర్సులను 2020, 2021ల్లో పాసైన అభ్యర్థులతోపాటు 2022లో సంబంధిత డిగ్రీ కోర్సులను పూర్తిచేసుకునే వారు ఈ ప్రోగ్రామ్కు అప్లై చేసుకోవచ్చు. పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ/ బీసీఏ/ ఒకేషనల్ కోర్సుల్లో కనీసం 50శాతం మార్కులు ఉండాలి. అకడమిక్ మొత్తం మీద రెండేళ్లకు మించి గ్యాప్ ఉండొద్దు.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎంపికైన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఏఆర్, వీఆర్లపై నిపుణులతో టీసీఎస్ స్పెషల్ ట్రైనింగ్ అందిస్తుంది. శిక్షణ పూర్తయిన అభ్యర్థులను సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేర్చుకుంటుంది. జాబ్లో చేరాక పని చేస్తూ చదువుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్లో భాగంగా నిర్వహించే పరీక్షలో 80 ప్రశ్నలు 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ–24 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.
న్యూమరికల్ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి 26 ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, నంబర్ సిస్టమ్/ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్, పర్సంటేజెస్, అలిగేషన్ అండ్ మిక్సర్, ప్రాబబిలిటీ, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాలెండర్ అండ్ క్లాక్, ప్రోగ్రెషన్స్, డివిజిబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
వెర్బల్ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి వచ్చే 24 ప్రశ్నలను 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. స్పాటింగ్ ద ఎర్రర్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్, చేంజ్ ఆఫ్ వాయిస్, వెర్బల్ అనాలజీస్, సినోనిమ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కరెక్షన్, కంప్లీటింగ్ స్టేట్మెంట్స్, పేరాగ్రాఫ్ ఫార్మేషన్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, చేంజ్ ఆఫ్ స్పీచ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రీజనింగ్ ఎబిలిటీ: ఇందులో 30 ప్రశ్నలకు 50 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. ఈ విభాగంలో స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, డైరెక్షన్ సెన్స్, సిరీస్, విజువల్/స్పేషియల్ రీజనింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ అనాలసిస్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, డెసిషన్ మేకింగ్, లెటర్ సిరీస్ సంబంధ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 30 నవంబర్
వెబ్సైట్: www.tcs.com
విప్రో ‘వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం’
విప్రో సంస్థ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 ద్వారా బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. 2022లో డిగ్రీ పూర్తి చేసుకునే అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు: పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతోపాటు బీసీఏ, బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల అభ్యర్థులు అర్హులు. డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి. రెగ్యులర్, ఫుల్టైమ్ విధానంలో ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ (వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్), రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ డిస్కషన్ రౌండ్ క్లియర్ చేయాలి.
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు మొదటి నాలుగేళ్ల పాటు నెలకు రూ.15000 నుంచి రూ.23000 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్గా నియమించి .. ప్రతిభ ఆధారంగా రూ.6 లక్షల వార్షిక వేతనం అందిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
వెబ్సైట్: www.careers.wipro.com
హెచ్సీఎల్ ‘ఫస్ట్ కెరీర్స్’
డిగ్రీ అభ్యర్థుల కోసం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ‘ఫస్ట్ కెరీర్స్’ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. గ్రాడ్యుయేట్స్ను పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ ఐటీ ఇంజనీర్స్గా తీర్చిద్దేందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. హెచ్సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్ను కంపెనీ అనుబంధ విభాగమైన హెచ్సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్ (హెచ్సీఎల్ టీఎస్ఎస్) ద్వారా అందిస్తున్నారు.
అర్హతలు: బీటెక్/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ(ఐటీ)/ బీఎస్సీ(ఐటీ, కంప్యూటర్ సైన్స్/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్(సీఎస్/ఐటీ/సాఫ్ట్వేర్ డెవలప్మెంట్)/ బీసీఏ అభ్యర్థులు హెచ్సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇంటర్, డిగ్రీ, పీజీలో 65 శాతానికిపైగా మార్కులు రావాలి. 2018, 2019, 2020, 2021ల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. మూడు నెలలు వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, మరో మూడు నెలలు హెచ్సీఎల్ టెక్నాలజీస్లో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికల్, ప్రాక్టికల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్లో శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్కు కోసం కంపెనీకు రూ.1.5 లక్షల ఫీజు చెల్లించాలి. బ్యాంక్లోన్ అందించడంలో సాయం చేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రూ.2.75 లక్షల వార్షిక వేతనంతో హెచ్సీఎల్లో కొలువు లభిస్తుంది.
వెబ్సైట్: www.hclfirstcareers.com
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్