భారత్‎కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‎కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?

భారత్‎కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‎కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?

నవంబర్‎లో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎కు ముందు భారత్‎కు బిగ్ షాక్ తగలనుందా..? టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‎లోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడా..? అంటే బీసీసీఐ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. నవంబర్ 22వ తేదీ నుండి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వనున్న ఈ టెస్ట్ సిరీస్‎లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే, ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ నేపథ్యంలో ఈ సిరీస్ భారత్‎కు చాలా కీలకం. టెస్ట్ చాంపియన్ షిప్‎లో అడుగు ముందుకు వేయాలంటే భారత్ కచ్చితంగా ఈ సిరీస్ గెలిచి తీరాల్సిందే.

 ఇలాంటి పరిస్థితిలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‎కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‎లో ప్రారంభ రెండు మ్యాచులకు అందుబాటులో ఉండలేనని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పినట్లు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ భార్య రితీక గర్భవతి. ఆమె నవంబర్‎లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న రోహిత్.. ఆసీస్ సిరీస్‎లోని రెండు మ్యాచులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో నవంబర్ 22 నుండి 26 వరకు పెర్త్, డిసెంబర్ 6- నుండి10వ తేదీ వరకు ఆడిలైడ్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచులకు రోహిత్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు.

ALSO READ : ENG vs PAK 1st Test: తీసుకున్న గోతిలోనే పడ్డారు: ముల్తాన్ టెస్టులో ఓటమి దిశగా పాకిస్థాన్

ఒకవేళ సిరీస్ ప్రారంభానికి ముందే రితీక శర్మ డెలివరీ అయితే.. రోహిత్ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని.. అలా జరగని పక్షంలో హిట్ మ్యాన్ స్టార్టింగ్ మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‎తో జరిగిన టెస్ట్ సిరీస్‎లో భారత్‎కు అద్భుత విజయాన్ని అందించిన రోహిత్.. టీమిండియాకు ఎంతో కీలకమైన ఆసీస్ పర్యటనకు దూరం అవుతారనే ప్రచారం భారత అభిమానుల్లో ఆందోళన కల్గిస్తుంది. మరోవైపు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే భారత్‎ను నడిపించే వ్యక్తి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు బీసీసీఐ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.