
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్లో రూ.20 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి శుక్రవారం ప్రకటించారు. ఇండియా గ్రోత్పై నమ్మకం ఉందని యాన్యువల్ జనరల్ మీటింగ్లో షేర్హోల్డర్లను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని సెగ్మెంట్లపైనా ఐటీసీ ఫోకస్ పెట్టిందని, మరింతగా విస్తరించేందుకు ఇన్వెస్ట్ చేసిందని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇండియాను ఇతర దేశాలు గౌరవిస్తున్నాయని, భవిష్యత్లో మరింతగా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నాయని పూరి పేర్కొన్నారు.
గత నాలుగేళ్లలో ఏడాదికి 10.8 శాతం చొప్పున ఐటీసీ గ్రూప్ రెవెన్యూ పెరిగిందని, సుమారు రూ.79 వేల కోట్లకు చేరుకుందని సంజీవ్ పూరి వివరించారు. ‘ఐటీసీ సిగరెట్టేతర బిజినెస్ల రెవెన్యూ ఏడాదికి 11.6 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం నెట్ రెవెన్యూలో 65 శాతం ఈ బిజినెస్ల నుంచే వస్తోంది. కరోనా సంక్షోభం టైమ్లో హోటల్స్, సిగరెట్ బిజినెస్లు భారీగా నష్టపోయాయి. ఈ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. గత రెండేళ్లలో సిగరెట్ బిజినెస్ రెవెన్యూ ఏడాదికి 13.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అమ్ముడైన సిగరెట్లు కరోనా ముందు స్థాయి లెవెల్స్ను దాటాయి’ అని సంజీవ్ పూరి పేర్కొన్నారు. హోటల్స్ బిజినెస్ 2023–24 లో రూ.3 వేల కోట్ల రెవెన్యూ, రూ. వెయ్యి కోట్ల ఇబిటా (ట్యాక్స్, వడ్డీలకు ముందు ప్రాఫిట్) సాధించిందని అన్నారు.