హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ యూనియన్బడ్జెట్లా లేదని, బిహార్ ఎన్నికల బడ్జెట్ లా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. వారివి కోతలు తప్ప చేతలు లేవన్నారు. పన్నుల్లో వచ్చే వాటా తప్ప ప్రత్యేకంగా తెలంగాణకు ఒక్క రూపాయి తేలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు కిషన్రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు.
శనివారం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. యూపీఏ హయాంలో హైదరాబాద్ లో మౌలిక వసతులు కల్పించడం వల్లే రాష్ట్ర బడ్జెట్మూడు లక్షల కోట్లకు చేరిందని, ఇది యూపీఏ ఘనత అని, మీ చరిత్ర ఏమిటో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి ప్రజలు ఏడాదికి రూ.లక్ష కోట్ల పన్నులు కడ్తున్నా వచ్చేది గోరంతే అన్నారు. నిర్మల సీతారాం పేరుకే తెలుగు ఆడపడుచు అని, ఆమె తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే ఆమె రాజకీయంగా ఎంత బలహీనురాలో అర్థమవుతోందన్నారు.