![జగిత్యాల జిల్లాలో బైక్ దొంగల ముఠా అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/webthumb2_qS0KzQZ8XY.png)
జగిత్యాల రూరల్, వెలుగు: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేశ్, సంపతి కుమారస్వామి , ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీకి చెందిన బుర్ర రాజేందర్ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుండేవారు. జనవరిలో తిప్పన్నపేటకు చెందిన భారతపు పెద్ది రాజం ఇంటి ముందు పార్క్ చేసిన తన బండిని దొంగిలించారని జగిత్యాల రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఉదయం తిప్పన్నపేట శివారులో అనుమానాస్పదంగా కారులో తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 బైక్లు, ఒక కారు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.