James Anderson: రిటైర్మెంట్ ఇచ్చినా జట్టుతోనే: ఇంగ్లాండ్ మెంటార్‌గా అండర్సన్

James Anderson: రిటైర్మెంట్ ఇచ్చినా జట్టుతోనే: ఇంగ్లాండ్ మెంటార్‌గా అండర్సన్

ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ శనివారం (మే 11) అంతర్జాతీయ క్రికెట్ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో అండర్సన్ చర్చలు జరిపిన తర్వాత ఈ ఇంగ్లీష్ పేసర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జూలై 10న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు తన చివరి టెస్టు అని 41 ఏళ్ల ఈ దిగ్గజ బౌలర్ తెలిపాడు. మరో వారం రోజుల్లో (జూలై 10) టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అండర్సన్ రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు వినియోగించుకోవాలని చూస్తుంది. 

ఈ దిగ్గజ పేసర్ ను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మెంటార్ గా బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ సోమవారం (జూలై 2) విలేకరులతో మాట్లాడాడు. "లార్డ్స్ టెస్ట్ తర్వాత జిమ్మీ జట్టుతోనే కొనసాగుతారు. అతను ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కు మెంటార్ గా వ్యవహరిస్తాడు". అని ఆయన అన్నారు. ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో అండర్సన్ తన ఫామ్ ను ఎప్పుడూ కోల్పోలేదు. మరోవైపు 41 ఏళ్ళ వయసులోనూ అదరగొడుతూ ఆటకు వయసు అడ్డం కాదని నిరూపించాడు. 

2025-2026 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ సమయానికి అండర్సన్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. అండర్సన్‌కు వివరించినట్లు సమాచారం. ఈ కారణంగానే ఆండర్సన్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. 2002 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.