Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..

Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..

దసరా పండుగ.. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తారు.దసరా చివరిరోజు విజయదశమి ( అక్టోబర్​ 12) .. ఈ రోజుకు ఎంతో విష్టత ఉంది. ఆరోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు . ఇలా ఎందుకు చేస్తారు..? అసలు విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏంటి..? పురాణాల్లో జమ్మి చెట్టు గురించి ఏముందో తెలుసుకుందాం. . . .

పురాణాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  జమ్మి చెట్టు అనగా శమీ వృక్షం.. దీని ఆకులను పరమశివుడికి.. జగన్మాత దుర్గాదేవికి.. సిద్ది ప్రదాత వినాయకుడికి సమర్పిస్తారు.  రుషులు.. మహర్షులు.. యఙ్ఞాలు.. యాగాదుల క్రతువులు నిర్వహించే సమయంలో హోమం చేసేటప్పుడు ...  జమ్మి చెట్టు బెరడల నుంచి అగ్నిని పుట్టించి ప్రారంభించేవారు. ఇప్పటికి కూడా దేవాలయాల ప్రతిష్టల సమయంలో ఇలా వచ్చిన అగ్నితోనే హోమం మొదలు పెడతారు.  

పండితులు తెలిపిన వివరాల ప్రకారం... శమీ వృక్షము ( జమ్మి చెట్టు)ను పూజిస్తే పాపాలను తొలగుతాయని చెబుతున్నారు.  పూర్వకాలంలో లాకర్లు.. బ్యాంకులు లాంటివి ఉండేవి కావు.. అందుకే జమ్మి చెట్టుపై ముఖ్యమైన వస్తువులను భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయి.  అంతేకాదు.. వీటిని శత్రువుల నుంచి జమ్మి చెట్టు కాపాడుతుంది.  అందుకే అర్జునుడి ధనువు ( బాణం) జమ్మి చెట్టు కాపాడినది మహర్షులు చెప్పారు. అందుకే  నేటికి కూడా దసరా పండుగ రోజున ( అక్టోబర్​ 12) పోలీసులు తమ ఆయుధాలకు పూజలు జరిపించే సంప్రదాయం కొనసాగుతుంది.  రాముడు యుద్దానికి బయలు దేరేటప్పుడు జమ్మిచెట్టును దర్శించుకుని .. పూజించి వెళ్లాడు.  అందుకే విజయ దశమి రోజున జమ్మిచెట్టుకు పూజించి జమ్మి బంగారాన్ని.. ( జమ్మి ఆకులను) పంచుకుంటారు.  

శమీ శమియతే పాపం !
శమీ శత్రు వినాశం !
అర్జునస్య ధనుర్ధారి !
రామస్య ప్రియదర్శని!!

దసరా పండుగ రోజున ( అక్టోబర్​ 12) పై శ్లోకాన్ని పేపర్​ పై రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టు వద్ద ఉంచి పూజ చేస్తారు. సాయంకాలం .. సూర్యాస్తమం సమయంలో.. జమ్మి చెట్టుకు సకల దేవతలను ఆవాహన చేసి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప కలుగుతుందని నమ్మకం.  ఆ  తరువాత టపాసుల శబ్ధాలతో సంబరాలు జరుపుకుంటారు. 

జమ్మి చెట్టును పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని  పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం .. సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని హిందువులు నమ్ముతుంటారు.సంపదకు అధిదేవుడు కుబేరుడు దసరా రోజున రఘురాజుకు జమ్మి ఆకులు ఇవ్వగా.. వెంటనే అవి బంగారంగా మారాయని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

జమ్మిచెట్టును పూజించే సంప్రదాయం ద్వాపర యుగంనాటినుంచి వచ్చింది.  పాండవులు అరణ్యవాసానికి వెళ్లే సమయంలో తమ ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచి .. జమ్మిచెట్టుకు మొక్కి.. తమ ఆయుధాలను రక్షించమని ప్రార్థించి వెళ్లారు.  అరణ్యవాసం ముగిసిన తరువాత అంటే విజయదశమి రోజున పాండవులు.. జమ్మి చెట్టును పూజించి ఆయుధాలను తీసుకుంటారు.  ఇదే ఆయుధాలతో కౌరవులపై యుద్దం చేసి విజయం సాధించారు.  అప్పటినుండి, రాజులు, సైన్యం తమ ఆయుధాలను దసరా రోజున పూజించేవారు. శ్రామికులు, కార్మికులు, తమ పనిముట్లకు పూజా చేసి వారు, వాళ్ళ పిల్లలు, వారి గ్రామం అంతా బాగుండాలని అమ్మవారిని వేడుకుంటారు.

జమ్మి చెట్టు త్వరగా పుచ్చిపోదు, చెద పట్టదు. అందుకని, పాండవులు అక్కడ దాచారని చెబుతుంటారు.  జమ్మి ఔషధ వృక్షం కూడా. జమ్మి చెట్టు చుట్టూ ప్రదిక్షణ చేస్తే దాని నుండి వెలువడే గాలి కొన్ని రోగాలకు ఔషధ చికిత్సగా చెబుతుంటారు. జమ్మి పూజ చేస్తే కొన్ని గ్రహదోషాలు తొలుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది. గ్రామ పురోహితునితో జమ్మి  చెట్టు వద్ద గ్రామ పెద్దలు, ముఖ్యులతో పూజలు చేస్తారు.  అలా పూజలు చేసిన తరువాత ఆ జమ్మి ఆకును తీసుకొని వెళ్లి పెద్ద వారి చేతిలో  పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.