స్టేషన్ఘన్పూర్(చిల్పూరు), వెలుగు: బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనగామ జడ్పీ చైర్మన్, పార్టీజిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి హఠాన్మరణం చాలా బాధాకరమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. సోమవారం గుండెపోటుతో సంపత్రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలోని సొంతింట్లో ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం కేటీఆర్రాజవరం చేరుకొని సంపత్రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆయనమీడియాతో మాట్లాడారు. సంపత్రెడ్డి.. 14 ఏండ్ల పాటు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పనిచేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిబద్ధతతో విజయవంతం చేశారన్నారు. సంపత్రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ ఆఫీసుల్లో సంపత్రెడ్డి మృతికి నివాళులు అర్పించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.