యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, నాణ్య త లోపంతోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిందని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. బుధవారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్కు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు.
రుణమాఫీ ఇప్పటివరకూ సరిగా చేయలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందని మండిపడ్డారు. ఏ ఎగ్జామ్ జరిగినా పేపర్లు లీకులు అయ్యాయని, పేపర్ లీకుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని జానారెడ్డి ప్రకటించారు. అనంతరం వివిధ పార్టీల కార్యకర్తలకు కాంగ్రెస్లో చేరగా.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ లీడర్ కుంభం అనిల్కుమార్ రెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్ఉన్నారు.