జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం అడిషనల్ ఎస్సై రాథోడ్ తానాజీ నాయక్ (60) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. తానాజీ నాయక్ మరో 10 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. పోలీస్ స్టేషన్ క్వార్టర్ లో ఉంటున్న తానాజీ ఛాతీలో నొప్పి వస్తుందని హోంగార్డుకు తెలపగా, హోంగార్డు బ్రహ్మం, ఏఎస్సై బిక్లాల్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తుండగానే గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఏందా గ్రామానికి చెందిన తానాజీ నాయక్ 1983లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి ప్రమోషన్ పొందుతూ ఎస్సై స్థాయికి ఎదిగారు. భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
కరెంట్ షాక్ తో రైతు..
శివ్వంపేట: కరెంట్ షాక్ తో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రాములు తండాకు చెందిన రైతు చనిపోయాడు. మృతురాలి భార్య లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాంలాల్(54) మంగళవారం తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. బోరు మోటార్ ఆన్ చేయడానికి స్టార్టర్ డబ్బా దగ్గరికి వెళ్లి స్విచ్వేయడానికి ప్రయత్నిస్తుండగా, షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న బంధువు శ్రీకాంత్ తో కలిసి రాంలాల్ ను భార్య లక్ష్మి హైదరాబాద్ సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.