జన్వాడ ఫామ్ హౌస్ కేసు : విచారణకు విజయ్ మద్దూరి డుమ్మా.. కేటీఆర్ భార్యనూ విచారించిన పోలీసులు

జన్వాడ ఫామ్ హౌస్ కేసు : విచారణకు విజయ్ మద్దూరి డుమ్మా.. కేటీఆర్ భార్యనూ విచారించిన పోలీసులు

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో కాకరేపిన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్‎లో పార్టీకి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణిని పోలీసులు విచారించారు. మరోవైపు.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదు. ఆదివారం (అక్టోబర్ 27) విచారణకు హాజరైన విజయ్ మద్దూరి.. సోమవారం (అక్టోబర్ 28) పోలీసుల దర్యాప్తుకు డుమ్మా కొట్టాడు. 

జన్వాడ ఫామ్ హౌస్‎లో రైడ్ సమయంలో తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‎ను విజయ్ మద్దూరి తమకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతోనే విజయ మద్దూరి వేరే మహిళ ఫోన్ అందజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల సమయంలో విజయ్ మద్దూరి సతీమణి ఆయన పక్కనే ఉండగా.. తన సతీమణి నెంబర్ కాకుండా థర్డ్ పర్సన్ నెంబర్‎ను ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

ALSO READ | సిగ్గు శరం ఉందా కేటీఆర్.. ఆ అమ్మాయిల వివరాలన్నీ బయటపెట్టు: షబ్బీర్ అలీ

పార్టీలో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో పేకాట ఆడినట్లు తేలితే మరో కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల సమయంలో పోలీసుల కంటపడకుండా కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలా పరార్ అయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజ్ పాకాలా, విజయ మద్దూరి నోరు మెదిపితే కేసు దర్యాప్తు ముందుకు సాగుతోందంటున్నారు పోలీసులు.