
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ను బెంగళూరులో తాను నిర్వహిస్తున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్కు ఆహ్వానించినందుకు తనను విపరీతంగా ద్వేషిస్తున్నారని ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. పహల్గాం దాడికి ముందే ఈ వ్యవహారం జరిగినా ఉగ్రదాడితో సంబంధం పెట్టి తన కుటుంబంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నాడు. ‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిని. కానీ తప్పు అని భావించే దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు.
దేశం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే నా ఫ్యామిలీతోనూ గౌరవంగా ఉంటా. పహల్గాం దాడి కంటే ముందే క్లాసిక్ ఈవెంట్కు అర్షద్ను ఆహ్వానించాం. అది కూడా ఒక అథ్లెట్గా మాత్రమే పిలిచాం. ఇందులో మరో ఉద్దేశం లేదు. ఎన్సీ క్లాసిక్ అత్యుత్తమ ఈవెంట్. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టాప్ అథ్లెట్లను ఇండియాకు రప్పించడమే దీని లక్ష్యం. కానీ 48 గంటల్లో చాలా మార్పులు జరిగాయి.
అలాంటప్పుడు అర్షద్ ఈ ఈవెంట్కు ఎలా వస్తాడు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు ఎప్పుడైనా దేశ ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం’ అని నీరజ్ వివరించాడు. ఎన్నో ఏళ్లు శ్రమించి ఇండియా గర్వపడేలా చేసినా తన చిత్త శుద్ధిని ప్రశ్నించడం బాధగా అనిపించిందని నీరజ్ అన్నాడు. ‘నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారికే ఈ వివరణ ఇస్తున్నా.
దేశం కోసం చాలా శ్రమించా. నాకు దేశమే ముఖ్యం. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నాకు బాధగానే అనిపించింది. జరిగిన దానిపై నాకూ కోపంగానే ఉంది. మనం బలమేంటో చూపిస్తారని విశ్వసిస్తున్నా. మనమంత సాధారణ ప్రజలం. అనవసరమైన అపోహలను సృష్టించొద్దు’ అని నీరజ్ సోషల్ మీడియాలో పోస్టులో కోరాడు.