
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిన ప్రధాన నిందితుడు
- యూపీ పరారయ్యేందుకు ప్లాన్
- సుశీల, జ్ఞానేశ్వరి మర్డర్ కేసులో పోలీసుల పురోగతి
జవహర్ నగర్ వెలుగు: జవహర్ నగర్, లాలా గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు అరవింద్ను జవహర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా కౌకూర్ సమీపంలోని భరత్నగర్, లాలాగూడలో ఈనెల 4న, 6న తల్లీకూతుళ్లను హతమార్చిన కేసులో అరవింద్ ప్రధాన నిందితుడు. ఇతడు ఉత్తరప్రదేశ్ కు పారిపోయేందుకు మల్కాజిగిరి రైల్వేస్టేషన్లో వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇంతకుముందే మృతురాలు సుశీల కూతురు లక్ష్మిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అరవింద్ కోసం వెతుకుతుండగా ఆదివారం పట్టుబడ్డాడు.
భరత్ నగర్ ప్రాంతంలో నివసించే సుశీల, లాలాపేటలో ఉండే ఈమె పెద్ద కూతురు జ్ఞానేశ్వరిని మరో కూతురు లక్ష్మి తన ప్రియుడైన యూపీకి చెందిన అరవింద్తో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చింది. తమ ప్రేమకు అడ్డుపడుతున్నారనే కోపంతోనే వీరు హత్యలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అరవింద్ కు ఇప్పటికే పెండ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా సైనిక్ పురిలో ఉంటున్నారు. లక్ష్మితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీన్ని సుశీల కుటుంబం అంగీకరించకపోవడంతో అడ్డు తొలగించుకునేందుకు హతమార్చారు.