Team India: టీమిండియా విక్టరీ పరేడ్‌.. పాల్గొనాలని అభిమానులకు జై షా విజ్ఞప్తి

Team India: టీమిండియా విక్టరీ పరేడ్‌.. పాల్గొనాలని అభిమానులకు జై షా విజ్ఞప్తి

టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని జులై 4న గురువారం విక్టరీ పరేడ్‌ నిర్వహించనున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ విజయోత్సవ ర్యాలీ ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుండి ప్రారంభమై వాంఖడే స్టేడియం వరకూ సాగనుంది. గురువారం సాయంత్రం 5:00 గంటలకు ఈ విక్టరీ పరేడ్‌ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో భారత క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీసీసీఐ సెక్రటరీ జై షా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిని పంచుకున్నారు. 

"టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించే విక్టరీ పరేడ్‌లో మాతో చేరండి! మాతో జరుపుకోవడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటలకు మెరైన్ డ్రైవ్ నుండి వాంఖడే స్టేడియం వరకూ పయనించండి! తేది గుర్తుంచుకోండి!.." అని జై షా ట్వీట్ చేశారు.

మోడీతో సమావేశం

కాగా, బెరిల్‌ హరికేన్‌ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్‌ బృందం కొన్ని గంటల క్రితమే స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో వీరు భారత్‌కు పయనమయ్యారు. ఈ విమానం గురువారం(జులై 4) ఉదయం 6 గంటలకల్లా ఢిల్లీ చేరుకోనుంది. వీరు రాజధాని నగరంలో అడుగుటపెట్టాక ప్రధానితో సమావేశం కానున్నారు. అనంతరం ముంబై చేరుకొని విక్టరీ పరేడ్‌లో పాల్గొననున్నారు.