
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ సిట్ అధికారులకు అందుబాటులోకి రాలేదు. లైంగిక వేధింపుల కేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు ఉండడంతో ఈ కేసులో భవానీని విచారించేందుకు సిట్ అధికారులు ఆమెకు ఇదివరకే నోటీసులు పంపారు. విచారణకు సహకరించాలని, జూన్ 1న ఇంట్లో ఉండాలని కోరారు. ఆరోజు తాము మహిళా అధికారులతో వస్తామని తెలిపారు. అందుకు భవానీ అంగీకరించారు.
హొళెనర్సిపూర్ లోని చిన్నాంబిక నివాసంలో ఉంటానని ఆమె చెప్పారు. అయితే, భవానీ చెప్పిన అడ్రస్ కు సిట్ అధికారులు శనివారం వెళ్లగా ఆమె కనిపించలేదు. ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని భవానీ వేసిన పిటిషన్ ను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, భవానీ భర్త హెచ్ డీ రేవణ్ణపై కూడా ఇదివరకే లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.