
జేఈఈ-అడ్వాన్స్డ్.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో.. బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! జేఈఈ-మెయిన్ స్కోర్ ఆధారంగా..అడ్వాన్స్డ్కు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఒకవైపు జేఈఈ మెయిన్స్.. మరోవైపు బోర్డ్ పరీక్షలు.. ఇంకోవైపు అడ్వాన్స్డ్.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తేనే విజయం వరిస్తుంది! తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ –2024 పరీక్ష తేదీలను నిర్వాహక సంస్థ ఐఐటీ చెన్నై ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రిపరేషన్ ప్లాన్ తెలుసుకుందాం. .
విద్యార్థులు అడ్వాన్స్డ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. అడ్వాన్స్డ్కు అర్హతగా నిర్దేశించిన జేఈఈ మెయిన్స్ సిలబస్లో పలు అంశాలను తొలగించారు. కానీ అడ్వాన్స్డ్లో మాత్రం గతేడాది మాదిరిగానే సిలబస్ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో రెండింటి సమన్వయంతో సక్సెస్ సాధించొచ్చని పేర్కొంటున్నారు.
అర్హత: 2023లో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులు లేదా 2024లో సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. వయసు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్ 1,1999 తర్వాత; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థు లు అక్టోబర్ 1,1994 తర్వాత జన్మించి ఉండాలి. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు.. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. అదే విధంగా ఐఐటీల్లో సీట్ల కేటాయింపులో అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణతతోపాటు బోర్డ్ పరీక్షల్లో టాప్–20 పర్సంటైల్లో నిలవాలనే నిబంధనను కూడా కొనసాగించనున్నారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: జేఈఈ–అడ్వాన్స్డ్–2024 పరీక్షను రెండు పేపర్లుగా (పేపర్ 1, పేపర్ 2) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి పేపర్కు కేటాయించిన సమయం మూడు గంటలు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. అడ్వాన్స్డ్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ప్యాట్రన్పై పూర్తి అవగాహన ఉండాలి. గతేడాది మొత్తం రెండు పేపర్లుగా 360 మార్కులకు పరీక్ష జరిగింది. పేపర్-1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 ప్రశ్నలు చొప్పున మొత్తం 54 ప్రశ్నలు అడిగారు. పేపర్-2లో కూడా ఇదే విధంగా 54 ప్రశ్నలు అడిగారు. ఇంటీజర్స్, న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు 2, 4 మార్కులు చొప్పున కేటాయించారు.
రివిజన్+ ప్రాక్టీస్
మ్యాథ్స్: పరీక్షలో ఎంతో కీలకంగా భావించే మ్యాథ్స్లో రాణించడానికి కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముఖ్యంగా 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; బైనామియల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి.
ఫిజిక్స్: న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ కూడా ఉండే ఈ విభాగంలో మంచి స్కోర్ కోసం ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్పై నాలెడ్జ్ ఉండాలి.
కెమిస్ట్రీ: అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలి.
అవగాహన ముఖ్యం: అడ్వాన్స్డ్కు ప్రిపరేషన్లో భాగంగా విద్యార్థులు ప్రధానంగా ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్;మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్తో ప్రిపరేషన్ కొనసాగించాలి.
ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్: విద్యార్థులు కనీసం వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ రాసే విధంగా సమయం కేటాయించుకోవాలి. ఆ పరీక్ష ఫలితం విశ్లేషించుకుని..తాము చేస్తున్న పొరపాట్లపై అవగాహన పెంచుకోవాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గత నాలుగేళ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాల్లో కనీసం రెండు ప్రశ్న పత్రాలను సాధన చేయాలి.
ఎగ్జామ్ హాల్ టిప్స్: పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం పూర్తిగా చదివేందుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు కేటాయించాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. వీలైతే పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలు సమాధానాల రివ్యూకు కేటాయించాలి. పరీక్ష హాల్లో.. కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే కౌంట్డౌన్ టైమర్ను చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగితే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్ష హాల్లో సమయపాలన పాటించడం చాలా ముఖ్యం.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అడ్వాన్స్డ్ పరీక్ష మే 26 (పేపర్–1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్–2 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు) నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.jeeadv.ac.in వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సంప్రదించాలి.
ప్రిపరేషన్ ప్లాన్: బోర్డు పరీక్షలు, జేఈఈ–మెయిన్ రెండో సెషన్ ముగిసిన తర్వాత అడ్వాన్స్డ్కు పూర్తి స్థాయి ప్రిపరేషన్ ప్రారంభించాలి. అధిక శాతం సమయాన్ని రివిజన్కు కేటాయించాలి. అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొశ్చన్స్, ప్రీవియస్ కొశ్చన్స్ను సాధన చేయాలి. ప్రతి వారం వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరవుతూ లోటుపాట్లు సరిచూసుకోవాలి. ప్రిపరేషన్ తుది దశలో రివిజన్, ప్రాక్టీస్కు పెద్దపీట వేయాలి. ప్రాక్టీస్కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంటీజర్స్, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం నాలుగు మోడల్ టెస్ట్లకు హాజరు కావాలి. అన్ని సబ్జెక్ట్లలో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్ను అనుసరించాలి. కాన్సెప్ట్లను వాస్తవ పరిస్థితుల్లో అన్వయం చేసే విధంగా సాధన చేయాలి. తద్వారా పరీక్షలో అడిగే మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్, మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్ వంటి వాటికి సులభంగా సమాధానం ఇచ్చే సన్నద్ధత దొరుకుతుంది.
బోర్డ్ ఎగ్జామ్స్తో సమన్వయం అభ్యర్థులు బోర్డ్ పరీక్షలు, జేఈఈ–మెయిన్ పరీక్షతో సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్డ్ దిశగా అడుగులు వేయాలి. మెయిన్ తొలి సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ సిలబస్పైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్డ్కు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. జేఈఈ–మెయిన్ రెండో సెషన్కు కూడా హాజరయ్యే అభ్యర్థులు ఆ సమయంలో అడ్వాన్స్డ్ సిలబస్ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి