
- పరారీలో మరొకరు.. రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి వరుస చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన బేగరి వేణుకుమార్ ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడు. గత నెల 6న రాత్రి అపురూపకాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గాజులరామారంలో వేణుకుమార్ ను పట్టుకున్నారు.
విచారణలో ఇటీవల జీడిమెట్ల, బాచుపల్లి, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు ఒప్పకున్నాడు. వేణుకుమార్వద్ద నుంచి ద్విచక్రవాహనంతోపాటు ఆభరణాలు, రూ.50 వేలు కలిపి మొత్తం రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సంపత్ సాయి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వేణుకుమార్పై పోక్సో, ఎన్డీపీఎస్ కేసులతో కలిపి 44 కేసులున్నట్లు పేర్కొన్నారు. గతంలో పలుమార్లు జైలుకు పంపడంతోపాటు దుండిగల్పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ సైతం నమోదు చేసినట్లు చెప్పారు.