
జగిత్యాల : ఐదేళ్ల పాలన తర్వాత కేసీఆర్ కు రెవెన్యూ అవినీతి ఇప్పుడు గుర్తోచ్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. రాష్ట్రంలో భూప్రక్షాళన సరిగ్గా జరగలేదని ఆరోపించారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదని చెప్పారు. పాలనా విధానంలో మార్పు రావాలన్న జీవన్ రెడ్డి..ఐదేళ్ల TRS పాలనలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్రంలో ఇంకా 25 శాతం మంది రైతులకు పాసుపుస్తకాలు అందలేదని గుర్తు చేశారు.
జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ చాలా తప్పులున్నాయని తెలిపారు. ఎన్నో లోపాలున్నా భూప్రక్షాళన బాగా చేశారని రెవెన్యూ సిబ్బందికి సీఎం మెచ్చుకుని రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తారని గ్రహించిన సీఎం తన తప్పును ఉద్యోగులపై నెడుతున్నారన్నారు. కేటీఆర్ లంచం తీసుకొమ్మని చెప్పారని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. సీఎం పాలనా విధానం, ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు జీవన్ రెడ్డి.