
తొలిసారిగా ఇంటర్నెట్ వాడే వారి కోసం ‘డిజిటల్ ఉడాన్’ పేరిట కొత్త ప్రోగ్రామ్ను రిలయన్స్ జియో లాంఛ్ చేసింది. ఇండియాలో డిజిటల్ లిటరసీ పెంచేందుకు ఈ చొరవ తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఇండియాలో 30 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు డిజిటల్ బాట పట్టారని, వారిలో ఎక్కువ మంది మొదటిసారి ఇంటర్నెట్ వాడుతున్నారని తెలిపింది. 13 రాష్ట్రాలలోని 200 ప్రాంతాలలో డిజిటల్ ఉడాన్ లాంఛ్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే 7,000 ప్రాంతాలను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. జియోఫోన్లోని ఫీచర్లు, యాప్ల గురించి ప్రతి శనివారం యూజర్లకు తెలిపేలా ఇది ఉంటుందని తెలిపింది. పది భారతీయ భాషలలో ఆడియో–విజువల్ ట్రైనింగ్ ద్వారా తమ లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్ రూపొందించేందుకు ఫేస్బుక్తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇండియాలోని కన్స్యూమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించాలనేదే తమ ధ్యేయమని, అందుకే గ్లోబల్ పార్ట్నర్స్తో కలిసి పనిచేస్తున్నామని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ ఈ ప్రోగ్రామ్ను తీసుకెళ్లి, నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించాలనుకుంటున్నామని అంబానీ తెలిపారు.