టీవీ నుంచి టిక్​టాక్ వరకు.. స్టార్ యూట్యూబర్ జోష్​హార్మన్ స్మార్ట్ కెరీర్ ​

టీవీ నుంచి టిక్​టాక్ వరకు.. స్టార్ యూట్యూబర్ జోష్​హార్మన్ స్మార్ట్ కెరీర్ ​

జోష్​ హార్మన్​ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న షార్ట్‌‌‌‌ హిల్స్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. అతనికి ఆర్ట్స్ మీద ఉన్న ఇష్టంతో డ్రమ్స్​ వాయించడం నేర్చుకున్నాడు. 2018లో ఆమ్​హెర్స్ట్ కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు. 

ఆ తర్వాత ఏం చేయాలో తోచక కొన్ని నెలలపాటు ఖాళీగానే ఉండిపోయాడు. అప్పుడే అమెరికాకు చెందిన ఒక పెద్ద టీవీ ఛానెల్​ ఎన్​బీసీ(నేషనల్​ బ్రాడ్​కాస్టింగ్​ కంపెనీ)లో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. అక్కడ ఉద్యోగం వస్తుందని ఏమాత్రం ఊహించలేదు. 

కానీ.. అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్​ టీవీ ఇండస్ట్రీలోకి వెళ్లడానికి గోల్డెన్​ గేట్​వేగా అనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యోగంలో చేరిపోయాడు. 

కరోనాతో.. 

ఏడాది పాటు ఎన్​బీసీలో ప్రసారమయ్యే ‘‘టుడే’’, ‘‘ది టునైట్” షోస్​ కోసం పనిచేశాడు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 2020 మార్చిలో అమెరికాలో చాలా టెలివిజన్ స్టూడియోలు మూసేశారు. 

దాంతో.. జోష్​ తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాంతో తల్లిదండ్రుల దగ్గర ఉంటూనే ‘‘టుడే” షో కోసం న్యూస్​లెటర్​ రైటర్​గా రిమోట్‌‌‌‌గా పని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే సోషల్​ మీడియా ముఖ్యంగా ‘యూట్యూబ్​, టిక్​టాక్’​ వాడకం బాగా పెరిగింది. 

దాంతో.. జోష్​ కూడా సోషల్​ మీడియాలో అడుగుపెట్టాడు. వాస్తవానికి మొదట్లో అతనికి సోషల్​ మీడియా మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ.. అతని సోదరుడు​ జోష్​ని ఒప్పించి మొదటి వీడియో పోస్ట్​ చేయించాడు.  

యూట్యూబ్​లోకి...

జోష్​ 2013లోనే ‘జోష్ ​హార్మన్​’ యూట్యూబ్​ ఛానెల్​ పెట్టాడు. ఆ తర్వాత కొన్నేండ్లకు ఒకట్రెండు వీడియోలు అప్​లోడ్​ చేసినా వ్యూస్​ రాలేదు. కానీ.. 2020 నుంచి రెగ్యులర్​గా వీడియోలు పోస్ట్​ చేస్తున్నాడు. అతనికి డ్రమ్స్​ వాయించే అలవాటు ఉంది. 

అందుకే డ్రమ్మింగ్ వీడియోలతోనే సోషల్​ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోలను యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​తోపాటు టిక్​టాక్​లో పోస్ట్ చేశాడు. ప్రతి వీడియోకు రీచ్​ బాగా వచ్చింది. దాంతో.. టిక్‌‌‌‌టాక్‌‌‌‌లో ‘‘రిథమ్స్ ఆఫ్ కామెడీ” పేరుతో సొంత సిరీస్‌‌‌‌ మొదలుపెట్టాడు. 

ఇందులో స్టాండ్–అప్ కమెడియన్లు జోక్స్​ చెప్తున్న వీడియోలకు డ్రమ్స్​ ప్లే చేశాడు. ఆ తర్వాత బాగా జనాదరణ పొందిన సినిమాల నుండి సౌండ్ ఎఫెక్ట్స్​ను రీ క్రియేట్​ చేయడం మొదలుపెట్టాడు. 

‘రాటటౌల్లె’ అనే కామిక్​ సినిమాలోని కుకింగ్​ సీన్​కి జోష్​ డ్రమ్స్​ని వాడి సౌండ్స్​ క్రియేట్​ చేసి ఆ వీడియోని టిక్​టాక్​లో పోస్ట్​ చేశాడు. దానికి బోల్డెంత రీచ్​ వచ్చింది. అప్పట్లో దానికి ఒక రోజులోనే 43 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో టిక్​టాక్​లో ఆ వీడియో ట్రెండింగ్​లో ఉంది. ఇప్పటివరకు ఆ వీడియోకు173 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 

సక్సెస్​తో.. 

టిక్​టాక్​లో వచ్చిన సక్సెస్​తో జోష్​కి డబ్బులు కూడా బాగానే వచ్చాయి. యాడ్ రెవెన్యూతోపాటు బ్రాండ్ డీల్స్​ ద్వారా కూడా సంపాదించాడు. దాంతో  ఉద్యోగం వదిలేసి పర్మినెంట్​గా సోషల్​ మీడియాలో వీడియోలు చేయాలి అని నిర్ణయించుకున్నాడు.  జోష్​  చాలా ఇష్టంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరితే సొంతంగా ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదగొచ్చు అనుకున్నాడు. 

కానీ.. ఎక్కువగా కష్టపడకుండానే టిక్​టాక్​లో అది సాధ్యమైంది. అందుకే వెంటనే ఉద్యోగాన్ని వదిలేశాడు. సోషల్​ మీడియా తన లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గమని నమ్మాడు. ఉద్యోగం మానేసి తర్వాత ఏడాది తిరగకముందే ఉద్యోగం చేసినప్పడు వచ్చే జీతం కంటే రెట్టింపు డబ్బు సంపాదించాడు.

 ‘రిథమ్స్ ఆఫ్ కామెడీ’ బాగా సక్సెస్​ అయ్యింది. ఛానెల్​లో మొదటి వీడియో పోస్ట్​ చేసిన ఏడాదికే 9,00,000 మంది సబ్‌‌‌‌స్క్రయిబ్​ అయ్యారు. యూట్యూబ్​లో కూడా బ్రాండ్ డీల్స్, యాడ్ రెవెన్యూ మొదలైంది. 

కోట్ల వ్యూస్​

ప్రస్తుతం జోష్​ హార్మన్​ ఛానెల్​ను 7.87 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇతను ఎక్కువగా షార్ట్​ వీడియోలే చేస్తుంటాడు. ఇప్పటివరకు ఛానెల్​లో మొత్తం 187 వీడియోలు పోస్ట్​ చేశాడు. వాటిలో ఐదు వీడియోలకు 250 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్​ వచ్చాయి. అంతేకాదు.. 140కి పైగా వీడియోలకు మిలియన్​ కంటే ఎక్కువ వ్యూస్​ వచ్చాయి. ఛానెల్​లో లక్షలోపు వ్యూస్​ వచ్చిన షార్ట్​ వీడియో ఒక్కటి కూడా లేదు. జోష్​కు యూట్యూబ్​ నుంచి వచ్చేది చాలా తక్కువే. దాదాపు 85 శాతం ఆదాయం బ్రాండ్స్​ నుంచే వస్తుంది. 

అతనికి చిన్నప్పటినుంచి కళలంటే ఇష్టం. అందుకే.. ఆర్ట్స్​లోనే డిగ్రీ చేశాడు. కాలేజీ నుంచి బయటికి వచ్చిన వెంటనే తన టాలెంట్​తో ఒక పెద్ద టీవీ ఛానెల్​లో ఉద్యోగం సంపాదించాడు. కానీ.. అంతలోనే కరోనా ప్యాండెమిక్​ వచ్చింది. అదే అతనికి సోషల్​మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన తెచ్చింది.

 ఆ నిర్ణయం జోష్​ హార్మన్​ జీవితాన్ని మలుపుతిప్పింది. ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత ఏడాది తిరిగేలోపే అతని పాత జీతానికి రెట్టింపు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు.. ప్రతినెలా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు.  

చాలా కష్టం

‘‘కంటెంట్‌‌‌‌ క్రియేట్​ చేయడం అంత ఈజీ కాదు. బెస్ట్​ అవుట్​పుట్ రావాలంటే ఒక్కోసారి ఒకే వీడియో కోసం మూడు నుండి నాలుగు రోజులు  పనిచేయాలి. పైగా సోషల్​ మీడియాలో రెవెన్యూ రిస్క్​ కూడా ఉంటుంది. 

యాడ్​ రెవెన్యూ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయినా.. నిలదొక్కుకోవాలంటే నాతో పనిచేసేవాళ్లకు శాలరీ ఇవ్వాలి. బెస్ట్​ కంటెంట్​ ఇచ్చేందుకు ఎప్పుడూ ట్రై చేయాలి” అన్నాడు జోష్​ హార్మన్​.